హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. దీనికి ఒక పరిష్కార మార్గాన్ని అమలు చేయాలని ఇటీవలే రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, తయారీదారులు, నిపుణులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
ఎలక్ట్రానిక్, ఘన, ద్రవ వ్యర్థాలకు రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్ విధానాన్ని అమలు చేయాలని, మార్గదర్శకాలు విడుదల చేయాలని నిర్ణయించింది. దానికోసం నిపుణులతో చర్చించి ఒక పరిష్కారాన్ని చూపాలని కోరింది. అయితే, వ్యర్థాల నిర్వహణలో తెలంగాణ ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తున్నది.
ముఖ్యంగా ద్రవ వ్యర్థాలను వంద శాతం రీయూజ్ చేసేలా పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎస్టీపీలు ఏర్పాటు చేసి, నీటిని శుద్ధి చేసి వినియోగించుకొనేలా చర్యలు చేపట్టింది. ఘన వ్యర్థాల కోసం కూడా కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు.