కుట్ర కేంద్రానిది.. నింద ఆర్థిక సంఘానికి
సంప్రదాయాన్ని తుంగలో తొక్కిన మోదీ సర్కార్
కమిషన్ సిఫారసుల్లో అనుకూల అంశాలే అమలు
ఫైనాన్స్ కమిషన్ చెప్పకున్నా రాష్ర్టాలపై జబర్దస్తీ
ఆఫ్ బడ్జెట్ అప్పులను రాష్ర్టాల మెడకు చుట్టే యత్నం
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఇన్నాళ్లూ రాష్ర్టాల హక్కులను హరించిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా వాటిపై ‘ఆర్థిక యుద్ధం’ మొదలుపెట్టింది. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను బూచిగా చూపుతూ బడ్జెటేతర అప్పులను రాష్ర్టాల మెడకు చుట్టి.. అభివృద్ధికి బ్రేకులు వేస్తున్నది. వాస్తవానికి ఈ అంశంలో ఆర్థిక సంఘం చెప్పినదానికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. కమిషన్ సూచనల్లో తనకు నచ్చినవాటిని అమలు చేస్తూ, కొన్నింటిని తనకు అనుకూలంగా మలుచుకుంటూ రాష్ర్టాలపై కక్ష సాధిస్తున్నది. ఉదాహరణకు..
కమిషన్ చెప్పింది: ప్రభుత్వాలు బడ్జెటేతర రుణాలను నియంత్రించాలి. అదనపు రుణాలు తీసుకోవడంలో క్రమశిక్షణ పాటించాలి.
కేంద్రం చేసిందిదీ..: కమిషన్ సిఫారసుకు కేంద్రం సొంత భాష్యం చెప్పింది. బడ్జెటేతర రుణాలను రాష్ర్టాల అప్పుల్లో జమ చేస్తామంటూ అకస్మాత్తుగా ప్రకటించింది. కమిషన్ సిఫారసుల్లో ఈ పదమే లేదు. పోనీ.. రాష్ర్టాల అభిప్రాయాలను కూడా తీసుకోలేదు. దేశ చరిత్రలో ఇలా చేయడం ఇదే మొదటిసారి.
కమిషన్ చెప్పిందిదీ: ఎఫ్ఆర్బీఎం చట్టానికి భారీగా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రభుత్వాలు రుణ భారాన్ని తగ్గించుకునేలా ప్రణాళిక రూపొందించాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన అత్యున్నత కమిటీని నియమించాలి. సిఫారసులను పార్లమెంట్ ముందు ఉంచి, ఆమోదం పొందిన తర్వాత అమలు చేయాలి.
కేంద్రం చేసిందిదీ..: సిఫారసులన్నింటినీ పక్కనబెట్టి.. ‘రుణ భారాన్ని తగ్గించుకోవాలి’ అన్న పదాన్ని మాత్రం కేంద్రం తనకు అనుకూలంగా మలుచుకున్నది. రాష్ర్టాలు రుణాలను అర్జంటుగా తగ్గించుకోవాలంటూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు చేయకుండా రాష్ర్టాలకు అడ్డుపుల్ల వేసింది. నిధుల సమీకరణను నిలిపివేసింది.
ఇవెందుకు అమలు చేయలేదు??
రాష్ర్టాల అప్పులను అడ్డుకోవడంలో ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుంటున్న కేంద్రం.. అదే ఉత్సాహాన్ని కమిషన్ సూచనల అమలులో పాటించడం లేదు. ఇందుకు అనేక ఉదాహరణలు..
కమిషన్ చెప్పిందిదీ: 2019-20లో తెలంగాణకు కేంద్ర పన్నుల్లో వచ్చిన వాటాకు తగ్గకుండా 2020-21లోనూ నిధులు పంచాల్సి ఉన్నది. ఈ మేరకు తెలంగాణకు రూ.723 కోట్లను ఇవ్వాలి.
కేంద్రం చేసిందిదీ..: సాధారణంగా ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అమలు చేస్తుంది. కానీ చరిత్రలో తొలిసారి మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని గంగలో కలిపింది. తెలంగాణకు నయాపైసా ఇచ్చేందుకు ముందుకురాలేదు.
కమిషన్ చెప్పిందిదీ: 2021-26 మధ్య కాలానికి కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు ఇన్సెంటివ్లు, ప్రత్యేక గ్రాంట్లు, రంగాల వారీగా నిధుల కేటాయింపు జరుపాలని లెక్కలతో సహా సూచించింది.
కేంద్రం చేసిందిదీ: కేంద్రం ఈ ప్రతిపాదనలను ఒప్పుకోలేదు. అనేక సిఫారసులను పునఃసమీక్షించాలంటూ తిప్పి పంపింది.
కమిషన్ చెప్పిందిదీ: 14వ ఆర్థిక సంఘం తెలంగాణకు కేటాయించిన నిధుల్లో రూ.817.61 కోట్లు కేంద్రం బకాయి ఉన్నది. ఇందులో రూ.315.32 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు, రూ.502.29 కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సి ఉన్నది.
కేంద్రం చేసిందిదీ: 14వ ఆర్థిక సంఘం గడువు పూర్తయినా, తెలంగాణ ప్రభుత్వం పదుల సార్లు లేఖలు రాసినా ఆ నిధులను విడుదలచేయలేదు.
ఇవేకాదు.. 2014-15లో తెలంగాణకు రావాల్సిన సీఎస్ఎస్ బకాయిలు రూ.495.20 కోట్లను కేంద్రం పొరపాటున ఏపీ ఖాతాలో వేసింది. వీటిని తిరిగి ఇప్పించాలని కోరితే మోదీ ప్రభుత్వం స్పందించడం లేదు. మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచిస్తే ఇప్పటివరకు నయాపైసా విదల్చలేదు. మొత్తంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సినవి రూ.7,183 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని ఇవ్వాలని తెలంగాణ కోరినా, నీతి ఆయోగ్ వంటి కమిషన్లు చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఆర్థిక సంఘం చెప్పకున్నా రాష్ర్టాలపై కక్ష సాధిస్తున్నది.