2022 ఫిబ్రవరి 18: ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్లో ఏర్పాటు చేయనున్న ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్’ను (జీసీటీఎం) హైదరాబాద్కు తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించి భూమిని కేటాయించాలి. – సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
2022 మార్చి 2: ఐడీపీఎల్లో భూమి కేటాయించాలని కేంద్రం కోరుతున్నది. ఈ ప్రాంతం గ్రీన్జోన్లో ఉన్నది. కాబట్టి వేరే ఏ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొన్నా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి కేటాయిస్తుంది. అనుమతులకు సంపూర్ణ సహకారం అందిస్తుంది. – మంత్రి హరీశ్రావు రాసిన లేఖ
2022 మార్చి 9: జీసీటీఎంను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
కిషన్రెడ్డీ.. ఏది నీ పతార!
హైదరాబాద్, మార్చి 10 : కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఢిల్లీలో ఉన్న పతార ఏందో.. ఆయన ప్రకటనలకు, ఇచ్చే హామీలకు ఎంత విలువ ఉన్నదో, తెలంగాణపై కేంద్రానికి ఎంత అక్కసో తెలియడానికి ఈ ఉదాహరణ చాలు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ హైదరాబాద్లో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్’ (జీసీటీఎం) నెలకొల్పాలని నిర్ణయించుకొన్నట్టు కిషన్రెడ్డి గత నెల 18న తెలంగాణ సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో తెలిపారు. హైదరాబాద్లో ఇప్పటికే సీసీఎంబీ, సీఎస్ఐఆర్, డీఆర్డీవో, ఎన్ఐఎన్, ఐఐసీటీ, ఎఫ్డీటీఆర్సీ వంటి శాస్త్ర పరిశోధన సంస్థలు ఉన్నాయని, ఈ అనుకూలతల వల్లే హెల్త్ సెంటర్ను హైదరాబాద్కు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనిని ‘ఆయుష్ వర్సిటీ’గా అభివర్ణించారు. పైగా.. సెంటర్ ఏర్పాటుకు కావాల్సిన భూమి ఐడీపీఎల్లో ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్కు సూచించారు. దీనికి స్పందనగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమిని ఇస్తామని హామీ ఇచ్చింది. తీరా కేంద్ర ప్రభుత్వం ఈ సెంటర్ను తెలంగాణకు కాకుండా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కు మంజూరు చేసింది. జామ్నగర్లో సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
భూమి ఉచితంగా ఇస్తామని చెప్పినా..
సెంటర్ ఏర్పాటుకు బాలానగర్లోని ఐడీపీఎల్లో ఖాళీగా ఉన్న భూమిని కేటాయించాలని కేంద్ర ఆయుష్ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాంతం గ్రీన్జోన్లో ఉండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాలపై దృష్టిపెట్టింది. ఇదే సమయంలో ఫిబ్రవరి 18న కిషన్రెడ్డి సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో స్థలం కేటాయింపుపై పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఈ నెల 2న స్పందించారు. ఐడీపీఎల్ గ్రీన్ జోన్లో ఉన్నది కాబట్టి కేటాయించలేమని, కేంద్రం వేరే ఎక్కడ అడిగినా ఉచితంగా భూమిని కేటాయిస్తామని చెప్పారు. ఈ బాధ్యతను వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి అప్పగిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ సైతం ఇవే వివరాలతో ఈ నెల 2న కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి విద్యారాజేశ్కు లేఖ రాశారు. ఉచితంగా భూమిని ఇస్తామని, అన్ని రకాల అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు.
మాటలు నమ్మేదెట్లా?
క్యాబినెట్ తాజా నిర్ణయంతో కిషన్రెడ్డికి కేంద్రంలో ఉన్న పరపతి ఏమిటో తేలిపోయిందంటూ టీఆర్ఎస్ నేతలు, నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. గుజరాత్కు కేటాయిస్తుంటే కిషన్రెడ్డి ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దదిక్కుగా చెప్పుకొనే క్రమంలో హైదరాబాద్కు అది తెస్తాం.. ఇది తెస్తాం.. అంటూ ఇక్కడ ఊదరగొట్టడమే తప్ప ఢిల్లీలో ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదని చురకలు అంటిస్తున్నారు. కిషన్రెడ్డి ఇన్నాళ్లూ ఇచ్చిన, ఇకపై ఇచ్చే హామీల పరిస్థితి ఇలాగే ఉంటుందా? అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రెండు నెలల కిందట వానకాలం పంట కొనుగోళ్లు, బాయిల్డ్ రైస్ వివాదం కొనసాగుతున్న సమయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ముందుకొచ్చి.. ‘వానకాలంలో ఎంత ధాన్యం వచ్చినా కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఆ బాధ్యత నాది’ అని చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విషయాన్ని గుర్తు చేయగా ‘నేను కేంద్ర మంత్రిని.. స్వయంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. ఇంతకంటే ఏం హామీ కావాలి?’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాల అనంతరం కేంద్రం కొనుగోలు చేసింది. నిజంగానే కిషన్రెడ్డి మాటలు నమ్మి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.