తెలంగాణపై కేంద్రం వివక్ష
22 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల్లో దక్కని చోటు
కేంద్రం నిర్ణయంతో యువత ఉపాధికి విఘాతం
ఐటీలో దూసుకెళ్తున్న రాష్ర్టానికి కేటాయించరా?
ఈ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం పునఃపరిశీలించాలి
కేంద్ర ఐటీమంత్రి వైష్ణవ్కు లేఖలో మంత్రి కేటీఆర్
ఇప్పటికే ఐటీఐఆర్ను రద్దు చేసి.. తెలంగాణ ఐటీ రంగానికి, యువతకు కేంద్రం తీరని ద్రోహం చేసింది. ఇప్పుడు మళ్లీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్స్ అఫ్ ఇండియా (ఎస్టీపీఐ)లో అన్యాయం చేసింది. ఇది పూర్తిగా వివక్ష ప్రదర్శించడమే. ఇప్పటికైనా తెలంగాణకు ఎస్టీపీఐని కేటాయించే విషయాన్ని పునఃపరిశీలించాలి.
–కేంద్ర మంత్రికి లేఖలో కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు (ఎస్టీపీఐ)ల కేటాయింపుల్లోనూ రాష్ట్రంపై కక్షగట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తాజాగా ప్రకటించిన ఎస్టీపీఐల్లో రాష్ర్టానికి కనీసం ఒక్కటి కూడా కేటాయించకపోవడం.. తెలంగాణ పట్ల నరేంద్రమోదీ సర్కారు అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరికి అద్దంపడుతున్నదని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ తదితర రాష్ర్టాలకు 22 ఎస్టీపీలను కేటాయించిన కేంద్రం.. ఐటీ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ర్టానికి మొండిచెయ్యి చూపడం దారుణమని విమర్శించారు. దీనిపై పునఃపరిశీలన జరిపి తెలంగాణకు 5 ఎస్టీపీలను కేటాయించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు శనివారం ఓ లేఖ రాశారు.
ఐటీ ఎగుమతుల్లో అధిక వృద్ధిరేటు
దేశీయ ఐటీ రంగంలో అద్భుతంగా రాణిస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ.. కొనేండ్లుగా ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటును నమోదుచేస్తున్నదని మంత్రి కేటీఆర్ లేఖలో గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి (2014-15 ఆర్థిక సంవత్సరంలో) రూ.57,258 కోట్లుగా ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు ఇప్పుడు రూ.1,45,522 కోట్లకు పెరిగాయని, రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపై 6,28,000 దాటిందని పేర్కొన్నారు. భవిష్యత్తు వృద్ధిని చాటే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విషయంలోనూ హైదరాబాద్ సత్తా చాటుతూ బెంగళూరును మించిపోతున్నదని తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాలు తీసుకొన్నదని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, రూరల్ టెక్నాలజీ, ఇమేజ్, డాటా సెంటర్ తదితర విభాగాల్లో ప్రత్యేక పాలసీల అమలుతో రాష్ట్ర ఐటీ పరిశ్రమ ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నదని వివరించారు. దీని ఫలితంగా తెలంగాణ పాలసీలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం దేశానికే కాకుండా అంతర్జాతీయ ఐటీ హబ్గా హైదరాబాద్ మారిందని, ప్రపంచంలోని పలు పెద్ద కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ యువత ఉపాధికి గండి
హైదరాబాద్తోపాటు తెలంగాణలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కృషి చేస్తున్నదని, ఇప్పటికే ఆయా నగరాల్లో వివిధ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయినా ఇవేమీ పట్టనట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం, ఎస్టీపీల కేటాయింపుల్లో తెలంగాణను పరిగణలోకి తీసుకోకపోవడం ఇకడి యువతకు దక్కాల్సిన ఉపాధి అవకాశాలకు గండి కొట్టడమేనని ధ్వజమెత్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను రద్దు చేసి తెలంగాణ ఐటీ రంగానికి, యువతకు తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. ఐటీఐఆర్ పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసినా.. ఐటీ మంత్రిగా తాను, రాష్ట్ర ఎంపీలు పదేపదే కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తే, అది దేశ హితానికి, పురోగతికి తోడ్పడుతుందన్న విషయాన్ని కేంద్రం గుర్తించాలని, ఇప్పటికైనా విశాల దృక్పథంతో వ్యవహరించి నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ పట్టణాలకు ఎస్టీపీలను కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు.