వీరుల ఆత్మలు ఘోషిస్తాయి
కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తరతరాలుగా దేశం నిలబెట్టుకొంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని చూసి కచ్చితంగా స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయి.
సంక్షేమానికి స్వర్ణయుగం
బంకించంద్రుడు వందేమాతర గీతంలో పేరొన్న ‘సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలాం..’ భావనను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసి చూపించింది. రైతుబంధు, దళితబంధు, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, కల్యాణలక్ష్మి.. ఒకటా రెండా అనేక అద్భుతమైన పథకాలతో సంక్షేమానికి తెలంగాణ స్వర్ణయుగం తీసుకొచ్చింది.
– పంద్రాగస్టు ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఎచట మనస్సు నిర్భయంగా ఉండగలదో, ఎచట మనిషి ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు తిరుగగలడో, ఎచట జ్ఞానానికి ఎట్టి ఆటంకమూ ఉండదో, ఎచట లోకం ఇరుకైన అడ్డుగోడలతో చిన్న గదులుగా చీలిపోదో, ఎచట మనస్సు నిత్యం విశాల ఆశయాలను అన్వేషిస్తూ కార్యాచరణతో ముందుకు సాగిపోతుందో అటువంటి స్వేచ్ఛాధామమైన భూతల
స్వర్గంలోకి తండ్రీ నా దేశాన్ని మేలొలుపు!
– సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో వినిపించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ గద్దెపై ప్రస్తుతం కూర్చొన్న పెద్దలు సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పన్నుల్లో రాష్ర్టాలకు రావాల్సిన వాటా రాకుండాచేసి రాష్ర్టాలను బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలకు ఉచితాలనే పేరు తగిలించి అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ దుర్మార్గాన్ని చూసి కచ్చితంగా స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయన్నారు. సోమవారం భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. జాతీయ పతాకావిష్కరణ అనంతరం చరిత్రాత్మక గోల్కొండ కోటపై నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లెవేసే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతున్నది. భారతదేశం రాష్ర్టాల సమూహం అని పేరొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం చేస్తున్నది. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ర్టాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ర్టాల నెత్తిన రుద్దుతున్నది.
రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఈ విధంగానే రుద్దాలని చూసింది. రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతుల మీద విచక్షణారహితంగా హింసను ప్రయోగించి, వారిని దేశ ద్రోహులుగా చిత్రించే ప్రయత్నానికి ఒడిగట్టింది. చిట్టచివరకు రైతుల పోరాటానికి తలొగ్గి నల్ల చట్టాలను వెనక్కి తీసుకొన్నది. స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశానవాటికల దాకా ప్రజల అవసరాలన్నింటి మీదా కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నది. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత, ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయం.
విద్వేషపు రాజకీయం
కేంద్ర సర్కారు అసమర్థ నిర్వాకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూపాయి విలువ తీసికట్టు నాగంభొట్లు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోయింది. నిరుద్యోగం తీవ్రతరమవుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తరతరాలుగా దేశం నిలబెట్టుకొంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని చూసి కచ్చితంగా స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయి. మన రాష్ట్రంలోనూ మత చిచ్చు రేపాలని, శాంతి, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలని తద్వారా అభివృద్ధిని ఆటంక పరచాలని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని మేధావిలోకం, యువకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పి కొట్టాలి. తెలంగాణ సుదీర్ఘ కాలం అనేక సంక్షోభాల్లో చిక్కి కొట్టు మిట్టాడింది.
ఎనిమిదేండ్లలో కోలుకొని.. కడుపునిండా తింటూ.. కంటినిండా నిద్రపోతున్నది. ఈ సమయంలో ఏ వర్గాన్నీ విస్మరించకుండా, సకల జనులనూ విశ్వాసంలోకి తీసుకొంటూ ముందుకు నడిపించాల్సిన గురుతర బాధ్యత ముఖ్యమంత్రిగా నాపైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా ఉన్నది. బాపూజీ ప్రశంసించిన గంగాజమునా తెహజీబ్ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపైనా ఉన్నది. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో 61 పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రానికి 6 పతకాలను సాధించి పెట్టిన తెలంగాణ క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందనలు. ఎచట మనస్సు నిర్భయంగా ఉండగలదో,ఎచట మనిషి ఆత్మ విశ్వాసంతో తలఎత్తుకు తిరుగగలడో, అటువంటి స్వేచ్ఛాధామమైన భూతల స్వర్గంలో తండ్రీ నా దేశాన్ని మేలొలుపు! అని విశ్వకవి రవీంద్రుడు భగవంతునికి చేసిన ప్రార్థనలోని ఉదాత్త విలువలను మనం మళ్లీ మళ్లీ మననం చేసుకొందాం. స్వాతంత్య్రోద్యమ ఆశయాలను కాపాడుకోవడం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం.
ఆదాయానికి గండి కొట్టిన కేంద్రం
కేంద్రం రాష్ర్టాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతి రథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకొన్నారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కూర్చొన్న కొమ్మను నరుక్కొన్న చందంగా రాష్ర్టాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతున్నది. కేంద్రం పన్నుల రూపంలో వసూలుచేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41% వాటా రాష్ర్టాలకు చెల్లించాలి. ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపుతో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకొంటున్నది. దీని ద్వారా రాష్ర్టాలకు 2022-23లో రావాల్సిన 11.4 శాతం ఆదాయానికి గండి కొడుతున్నది. అంటే రాష్ట్రాలకు 41 శాతం వాటా రావాల్సిన చోట 29.6 శాతం మాత్ర మే ఇచ్చి అన్యాయం చేస్తున్నది. రాష్ర్టాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తున్నది. రాష్ర్టాలు ఎఫ్ఆర్బీఎం పరిమితిలో తీసుకొనే రుణాల మీద సైతం కేంద్రం కోతలు విధిస్తున్నది.
బురదజల్లడమే లక్ష్యం
తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే.. కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తున్నదని అవగాహనారాహిత్యంతోనూ.. కుట్రపూరితంగానూ వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 2019-20 సంవత్సరానికి రాష్ట్రం అప్పుల మొత్తం రూ.2,25,450 కోట్లు. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు రూ.75,577 కోట్లు. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,49,873 కోట్లు. ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించింది. జీఎస్డీపీలో రుణ నిష్పత్తి పరిశీలిస్తే 28 రాష్ర్టాల్లో 22 రాష్ర్టాలు మన రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయి. జీఎస్డీపీలో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5% కాగా, జీడీపీలో దేశం అప్పులు నిష్పత్తి 50.4%. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్ఆర్బీఎం చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గమనించకుండా బురద జల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్నారు.
గోల్కొండ కోటలో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారథిరెడ్డి, పీ రాములు, ఎమ్మెల్సీ టీ రవీందర్రావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు