హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. బయోఏషియా సదస్సు నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకపోయినా ఐటీరంగంలో తెలంగాణ అద్భుతమైన విజయాలు సాధించిందని చెప్పారు. సరైన నాయకత్వం, చిత్తశుద్ధి ఉన్న పాలకుడు ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించగలుగుతామని తెలంగాణ నిరూపించిందని చెప్పారు. రాష్ర్టానికి మంజూరైన ఐటీఐఆర్ను కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం నిలిపివేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రభు త్వం దూరదృష్టితో ఆలోచించి ఫార్మాసిటీని అభివృద్ధి చేస్తున్నదని, ఇందుకు కేంద్రం నుంచి ఏవిధమైన సహాయం లభించడం లేదని స్పష్టంచేశారు.
ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల్లో ప్రపంచానికి అత్యంత కీలకమైన ప్రాంతంగా తెలంగాణ ఆవిర్భవించిందనీ, దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఫార్మాసిటీ అభివృద్ధికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ, కేంద్రం పారిశ్రామిక అభివృద్ధి కన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నదని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికే ప్యాకేజీలు, పారిశ్రామిక పార్కులు ప్రకటిస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్-బెంగళూరు నడుమ డిఫెన్స్ డెవలప్మెంట్ కారిడార్ను ఏర్పాటు చేస్తే తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే డిఫెన్స్ రంగానికి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టాయని, రాష్ట్రంలోని రఘువంశీ, ఆజాద్ కంపెనీలు ఇక్కడి నుంచే బోయింగ్ సంస్థలకు పరికరాలను సరఫరా చేస్తున్నాయని వివరించారు.
కేంద్రం హైదరాబాద్లోని రక్షణరంగ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి సాధ్యమయ్యేదని చెప్పారు. కానీ, కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసమే డిఫెన్స్ కారిడార్ను బుందేల్ఖండ్కు తీసుకెళ్లిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వంలో ఫెడరల్ స్ఫూర్తి కనిపించడంలేదని విమర్శించారు. ‘టీం ఇండియా అన్నది పేరుకే. ఫార్మాసిటీకి ప్రోత్సాహకాలు ఇస్తలేరు. ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే ఇస్తలేరు. తెలంగాణలో అటవీ, మహిళ, హార్టికల్చర్ యూనివర్సిటీలు పెట్టాం. ఏవియేషన్ వర్సిటీ, లైఫ్సైన్సెస్ వర్సిటీ.. ఇలా అనేకం పెట్టబోతున్నాం. కేంద్రం ఇప్పటివరకు ఒక్కదానికైనా సహాయం చేస్తామని ముందుకొచ్చిందా? ఎందుకు కేంద్రం చొరవ తీసుకోలేదు? ఎక్కడ ఉన్నది టీం ఇండియా స్పిరిట్?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాల్లోనూ తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అద్భుతమైన మార్గనిర్దేశనం చేశారని చెప్పారు. సీఎం సూచనలతోనే తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు.
పెట్టుబడుల ఆకర్షణలో కొత్త పంథా
కొన్ని రాష్ర్టాలు పెట్టుబడులను ఆకర్షించే పేరుతో ‘ఇన్వెస్ట్మెంట్ మీట్’లు ఏర్పాటు చేస్తున్నాయని, దీనివల్ల పూర్తిగా ఉపయోగం ఉండదనేది సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘భారీ కార్యక్రమాలు ఏర్పా టు చేసి ఆర్భాటంగా వేల కోట్లు వచ్చాయని ప్రకటించుకోవడం చూస్తున్నాం. వాస్తవానికి అలాంటి కార్యక్రమాల్లో అప్పుడు చేసే ప్రకటనలకు, కార్యరూపం దాల్చే పెట్టుబడులకు మధ్య అంతరం ఉంటున్నది. 7-8 శాతం మించి పెట్టుబడులు రావడంలేదని తేలింది’ అని వివరించారు. పెట్టుబడిదారులతో మాట్లాడటం, వారిని రాష్ర్టానికి రప్పించడంలో కొత్త పంథాను అనుసరించి విజ యం సాధించామని వెల్లడించారు. ‘చాలా రాష్ర్టాలు తమ రాష్ర్టాల్లో పెట్టుబడులు పెట్టేవారు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని విధిగా నిబంధన పెడుతున్నాయి. ఈ పద్ధతి సరికాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను మనం పూర్తిగా సమకూర్చలేకపోవచ్చు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు మనవాళ్లు వెళ్లి పనిచేస్తున్నట్టే.. బయటివారు ఇక్కడికి వచ్చి పనిచేస్తారు’ అని కేటీఆర్ వివరించారు.