వైద్య కళాశాలలన్నీ వారి రాష్ర్టాలకే
మాట వినని రాష్ట్రాలకు మొండిచేయి
157 కాలేజీల్లో ఒక్క యూపీకే 27 మంజూరు
రూ.26 వేల కోట్లలో ఒక్క రాష్ట్రానికే 16 శాతం
తెలంగాణకు ఒక్కటీ ఇవ్వని బీజేపీ ప్రభుత్వం
ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపులోనూ అదే వివక్ష
హైదరాబాద్, మార్చి 27 : తమకు అనుకూలమైన రాష్ట్రాలకు, రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం దేశ సంపదనంగా దోచిపెడుతున్నది. సీఎస్ఎస్ పథకం కింద ఇప్పటివరకు మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి, వాటికోసం రూ.26,715 కోట్లు విడుదల చేయగా, వీటిలో అత్యధికం బీజేపీ పాలిత రాష్ట్రాలకే దక్కాయి. తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదు. రాష్ర్టానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద మెడికల్ కాలేజీల వివరాలు కోరగా, కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు ఇచ్చింది.
ఆరోవంతు యూపీకే..
కేంద్రం మంజూరు చేసిన కాలేజీలు, నిధుల్లో ఆరోవంతు ఉత్తరప్రదేశ్కే వెళ్లాయి. 157 కాలేజీల్లో 27 (17 శాతం) యూపీకి ఇచ్చారు. వీటి నిర్మాణానికి కేంద్ర నిధులు రూ.4,494.36 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం నిధుల్లో ఇవి 16 శాతం. ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ ఏలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్, అస్సాం, బీహార్ రాష్ర్టాలకు భారీగా లబ్ధి చేకూరింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజస్థాన్కు 23 కాలేజీలు, రూ.3,869 కోట్లు కేటాయించారు. పశ్చిమబెంగాల్కు 11 కాలేజీలు, రూ.1,512 కోట్లు మంజూరు చేశారు.
సీట్ల పెంపులోనూ వివక్షే
మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపులోనూ కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది. ప్రభుత్వ కాలేజీల్లో వసతులు పెంచి ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెరిగేలా చర్యలు తీసుకొనేందుకు కేంద్రం ‘అప్గ్రెడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్/సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ టు ఇంక్రీజ్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ ది కంట్రీ’ పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో మౌలిక వసతుల పెంపునకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాలి. ఈశాన్య రాష్ర్టాలైతే కేంద్రం 90 శాతం భరిస్తుంది. ఒక్కో సీటుకు రూ.1.20 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసి విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 52 మెడికల్ కాలేజీలకు సహాయం చేసింది. మొత్తం 3,495 సీట్లు పెరుగుతాయి. పీజీ సీట్ల పెంపుకోసం అమలు చేస్తున్న పథకం కింద మొదటి దశలో దేశవ్యాప్తంగా 72 కాలేజీలను ఎంపిక చేసింది. 4,058 సీట్లు పెంచుకొనేలా మౌలిక వసతుల కల్పనకు రూ.1,049 కోట్లు విడుదల చేసింది. రెండో దశలో మరో 18 కాలేజీలను ఎంపిక చేసి 1,872 సీట్లు పెంచుకొనేలా రూ.695 కోట్లు ఇచ్చింది. ఈ పథకం కింద తెలంగాణకు కేవలం రూ.42 కోట్లు విడుదల చేసింది.
మాట వినని రాష్ట్రాలపై కక్ష
కేంద్ర ప్రభుత్వం తన అనుకూల రాష్ర్టాలకు మాత్రమే మెడికల్ కాలేజీల మంజూరు, పీజీ, యూజీ సీట్లు పెంచుకొనేందుకు నిధులు ఇస్తున్నది. ఇప్పటివరకు మంజూరు చేసిన కాలేజీలను గమనిస్తే పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ, కేరళను మాత్రమే విస్మరించారు. కేరళ మొదటి నుంచీ బీజేపీకి కొరకరాని కొయ్యే. తెలంగాణ సైతం కేంద్రం వైఖరితో విభేదిస్తున్నది. దీంతో కేంద్రం వివక్షకు తెరలేపింది. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో టాప్-3లో ఉన్న రెండు రాష్ర్టాలను విస్మరించింది. సీట్ల పెంపులోనూ తెలంగాణకు అన్యాయం చేసింది. కేవలం రూ.42 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నది. కేరళకు కూడా రూ.39 కోట్లు మాత్రమే ఇచ్చింది.
– ఇనగంటి రవికుమార్, ఆర్టీఐ కార్యకర్త.