గమ్మత్తేమిటంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంది. దాన్ని ఉపసంహరించుకోమనడం మానేసి రాష్ర్టాలు పన్నులు తగ్గించాలని వీధుల్లోకి దిగుతారు. ధరల పెంపే భారమయ్యేట్టయితే అదేదో తమ జాతీయపార్టీకే చెప్పి తగ్గించవచ్చు కదా? అంటే నోరు పెగలదు. అంటే కేంద్రం ధరలు పెంచి ఆదాయం పోగేసుకోవాలి. రాష్ర్టాలు మాత్రం తమ తప్పులేకుండానే వచ్చే ఆదాయాన్ని కోల్పోవాలి. వీళ్లకు ప్రజల కష్టాలు, ఇబ్బందుల మీద కనీస సానుభూతి కూడా ఉండదు. కంటోన్మెంటులో రహదారులన్నీ మూసి అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడితే స్పందించరు. కానీ ప్రభుత్వం హెచ్చరికగా నీరు, కరెంటు ఆపేస్తామంటే అదేదో దేశద్రోహమైనట్టు లబలబలాడుతారు. సదరు కంటోన్మెంటులో సైన్యం నివాసాలు ఎంత శాతం? సామాన్య ప్రజల నివాసాలు ఎంత శాతం? అనే కనీస పరిజ్ఞానం లేని మాటలు.
సైన్యం ఉపయోగించే యుద్ధ విమానాల్లో అడ్డంగా కమీషన్లు బొక్కారని, కార్గిల్ యుద్ధంలో సైనికుల శవాలు తరలించే శవపేటికల కొనుగోలులో మామూళ్లు నొక్కారని ఆరోపణలు ఎదుర్కొన్న వారి నుంచి నీతులు వినాల్సి వస్తున్నది. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ మీద అంత రాద్ధాంతం చేశారు. ఇంతకూ 2021-22 సంవత్సరానికి కేంద్రం ఈ పథకం కింద ఇచ్చింది కేవలం రూ.309 కోట్లు. ఈ ముష్టి కోసం కేంద్ర మంత్రులనుంచి రాష్ట్రనాయకుల దాక రాద్ధాంతాలు. వీళ్ల గొప్పలకు మాత్రం తక్కువ లేదు. 25-30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఎపుడో 2021 జనవరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ చెప్పుకొన్నారు. త్వరలో చేరికలుంటాయని ఏడాదిగా ఆయన చెప్పుకుంటూనే ఉన్నారు. పార్టీనుంచి గెంటేసిన నాయకుడు తప్ప ఎవరూ వచ్చింది లేదు. చేరిందీ లేదు. ఆ మధ్య ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్సింగ్ రాష్ర్టానికి వచ్చారు. ఆయనకు తెలంగాణ గురించి ఏం తెలుసో మనకు తెలియదు. కానీ కేసీఆర్కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని సెలవిచ్చారు. ఇక్కడి సంగతేమో గానీ ఛత్తీస్గఢ్లో ప్రజలు అలా అనుకునే ఆయనను చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారు. ఇపుడపుడే తిరిగి అధికారం వచ్చే సూచనలు కూడా లేవు. అది మరిచిపోయినట్టున్నారు. ఆఖరుకు గ్రామీణ విద్యుత్ రుణ సంస్థ నుంచి వచ్చిన రుణాలను కూడా కేంద్ర సాయం కింద లెక్క గట్టడం మోదీ బీజేపీకి తప్ప ఈ భూగోళం మీద మరెవరికీ చేతకాదు.