హైదరాబాద్, అక్టోబర్1 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో నల్లాల ద్వారా నీటి సరఫరా చేసినందుకు అవార్డు ఇస్తే.. అది మిషన్ భగీరథకు ఇచ్చినట్టు కాదా? అని కేంద్ర జల్శక్తిశాఖను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. మిషన్ భగీరథకు అవార్డు ఇవ్వలేదంటూ కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ కొన్ని పత్రికలకు ఇచ్చిన ప్రకటనను మంత్రి ఖండించారు. గ్రామీణ ప్రాంతాలకు నీటి సరఫరాలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణను రెగ్యులేటరీ విభాగంలో అవార్డుకు ఎంపిక చేశామని, దానిని అందుకొనేందుకు అక్టోబర్ 2న అధికారులను ఢిల్లీకి పంపించాలని సెప్టెంబర్ 26న జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ వికాస్శీల్ సీఎస్కు లేఖ రాశారని వెల్లడించారు. అదే విషయాన్ని మంత్రి హరీశ్రావుతో కలిసి మీడియాకు వెల్లడించామని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ తన అభ్యంతరాలను లేవనెత్తిన లేఖలోనే మిషన్ భగీరథ పథకాన్ని సమీక్షించామని చెప్పిందని, ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు అనడం ఆశ్చర్యంగా ఉన్నదని వాపోయారు. 100 శాతం నల్లాల ద్వారా మంచి నీటిని అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తన వెబ్సైట్లో ఎందుకు పెట్టారని నిలదీశారు.