హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ)/మణికొండ/నాంపల్లి కోర్టులు: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలు దృష్టి పెట్టాయి. ఈ కేసును మొదటి నుంచి ఫాలో అవుతున్న ఈ సంస్థలు విచారణ అనంతరం తుది నివేదికను తమకు ఇవ్వాలని ఏసీబీ ఉన్నతాధికారులను కోరినట్టు విశ్వసనీయ సమాచారం. శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టాలో పలువురు ఐఏఎస్ అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుస్తున్నది. కొందరు ఐఏఎస్ అధికారులకు బాలకృష్ణ లబ్ధి చేకూర్చినట్టుగా ఏబీసీ విచారణలో గుర్తించింది. ఆ ఐఏఎస్ అధికారుల ఆస్తి పత్రాలు ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ప్రధానంగా మాజీ సీఎస్ సోమేశ్కుమార్కు చెందిన ఆస్తి పత్రాలు సైతం ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
భారీ మొత్తంలో బినామీ పేర్లపై ఆస్తులను కూడబెట్టిన శివబాలకృష్ణ.. తన తమ్ముడు నవీన్కుమార్, మరదలు, మేనల్లుడు భరత్ పేర్లపై భారీగా ఆస్తులు రాసిపెట్టాడు. 70 శాతానికిపైగా ఆస్తులు బినామీ పేర్లపైనే ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే నవీన్కుమార్ను ఏసీబీ అరెస్టు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. యాదాద్రిలో 66 ఎకరాలు, సిద్దిపేటలో 10 ఎకరాలు, జనగామలో 102 ఎకరాలు, నాగర్కర్నూల్లో 30 ఎకరాలు, కొడకండ్లలో 48, రఘునాథపల్లిలో 28, జఫర్గఢ్లో 50 ఎకరాలకు సంబంధించిన భూపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమతుల పేరుతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తున్నది. ఇటు కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించి ఐటీ సంస్థ కూడా నజర్ పెట్టింది.
శివబాలకృష్ణకు లబ్ధి చేకూర్చిన అనుయాయులపై ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేపట్టారు. గురువారం మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల పరిధిలోని పలు నిర్మాణరంగ సంస్థల వివరాలపై విచారణ జరిపినట్టు విశ్వసనీయ సమాచారం. శివబాలకృష్ణ అక్రమాస్తులు సంపాదించడంతో ప్రధాన పాత్ర పోషించిన పలు నిర్మాణ రంగ సంస్థల బ్యాంకు లావాదేవీలపై సమగ్ర విచారణ మొదలైనట్టు తెలియడంతో బిల్డర్లలో వణుకు మొదలైంది. పుప్పాలగూడలోని ఆదిత్యా ఫోర్ట్ విల్లాల్లో నివాసముంటున్న శివబాలకృష్ణ అక్రమాస్తుల్లో సగభాగం మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో ఆరు నిర్మాణరంగ సంస్థలల్లోనే పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. ప్రధానంగా ఈఐపీఎల్, ఇన్ఫ్రా, ఐరా, అనుహర్ వంటి సంస్థల్లో అతడు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.