Amit Shah | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోమంత్రి అమిత్షా కాస్త ‘మిత్’షాగా మారిపోయారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర పర్యటనలో తనకు అలవాటైన కట్టుకథలే చెప్పి వెళ్లిపోయారు. చేవెళ్లలో నిర్వహించిన బహిరంగసభలో అమిత్షా మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడకముందు తెలంగాణకు కేంద్రం నుంచి సంవత్సరానికి రూ.30 వేల కోట్లు మాత్రమే వచ్చేవని, 2022-23లో రూ.1.20 లక్షల కోట్లు ఇచ్చామని సెలవిచ్చారు. 2014కు ముందు తెలంగాణ రాష్ట్రం ఎక్కడుందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన కేటాయింపులను తెలంగాణకు ఇచ్చినట్టు చెప్పడం ఏమిటని నిలదీస్తున్నారు. ‘ఇన్ని అబద్ధాలు చెప్పే అమిత్షా.. తెలంగాణకు ఏదో చేశామంటే నమ్మేవాళ్లు ఎవరు?’అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు తెలంగాణలో అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని, పచ్చి అబద్ధాలు ఆడుతారని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్తున్నారు.
రాష్ర్టానికి మెగాటెక్స్టైల్ పార్క్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా కేంద్రాన్ని కోరుతున్నది. అయినా పట్టించుకోకపోవడంతో వరంగల్లో సొంతంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేసింది. దీనికి నిధులు మంజూరు చేయాలని కోరినా ఇవ్వలేదు. ఇప్పుడేమో అమిత్షా వచ్చి రాష్ర్టానికి మెగా టెక్స్టైల్ పార్క్ ఇస్తామని మాయమాటలు చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.లక్ష కోట్లు మంజూరు చేశామని అమిత్షా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇప్పటివరకు కేటాయింపులు రూ.30 వేల కోట్లు కూడా దాటలేదు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా అమిత్షా భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ కేంద్రంలో పీఎం సీటు ఖాళీగా లేదు’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ను చూసి బీజేపీకి చెమట పడుతున్నదని చెప్పడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదు. తొమ్మిదేండ్లలోనే దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ను తప్ప ఆ పదవిలో మరొకరిని ఊహించుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఆ అవసరం కూడా లేదు. అయినా ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం’ అంటూ అమిత్షా భ్రమల్లో తేలియాడారు.
పద్మభూషణ్ గులాం అలీఖాన్కు ప్రణామం చేస్తున్నానంటూ చెప్పిన వేదిక మీది నుంచే.. ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామంటూ మతచిచ్చు రేపేందుకు అమిత్షా ప్రయత్నించారు. ఎవరైనా తమకు అధికారం కావాలనుకుంటే ప్రజల మనసులు గెలిచేలా ఇంత వరకు ఏం చేశామో చెప్తారు. లేదా ఒక వేళ అధికారం ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామో వివరిస్తారు. కానీ అమిత్షా, బీజేపీ నేతలు మాత్రం ప్రజల్లో వివక్ష పెంచేందుకు, భ్రమలు కల్పించేందుకు మాత్రమే పరిమితం అయ్యారు.
అదానీ విషయంలో జేపీసీ కాదుకదా.. కనీసం సిట్ కూడా వేయనివారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. గుజరాత్లో మోదీ సీఎంగా, అమిత్షా హోం మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకుల్లో గుజరాత్ మొదటిస్థానంలో ఉన్నమాట నిజం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. వ్యాపం వంటి అతి జుగుప్సాకరమైన కుంభకోణం చేసిన పార్టీ బీజేపీ కాదా? అని నిలదీస్తున్నారు. పీఎం కేర్స్కు వచ్చిన నిధులెన్ని? ఎంత? ఎందుకు? ఖర్చు పెట్టారో చెప్పనివారు, పీఎం కేర్స్కు కాగ్ ఆడిట్ కూడా వర్తించదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినవారు సుద్దులు చెప్పడం ఏమిటని అడుగుతున్నారు.
గంగా స్నానం.. తుంగా పానం అన్నది లోకోక్తి. అంటే పవిత్రతకు మారు పేరుగా గంగానదిని కొలుస్తారు. ఆ పవిత్ర నదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు పోతాయన్నది హిందువుల నమ్మిక. అలాంటి పవిత్ర గంగానదిని అవినీతితో పోల్చటంపై దేశం భగ్గుమంటున్నది. తెలంగాణపై బురదచల్లటానికి తెగబడిన కేంద్ర మంత్రి అమిత్షా రాష్ట్రంలో అవినీతి గంగలా ప్రవహిస్తున్నదని నోరుపారేసుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షకులుగా, సనాతన ధర్మాన్ని తు.చ. తప్పకుండా ఆచరిస్తామని నిత్యం ప్రగల్భాలు పలికే అమిత్షా లాంటి వారే గంగానదిని భ్రష్టాచారి గంగ అని తూలనాడటం ముమ్మాటికి హిందువుల మనోభావాలను కించపర్చటమేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ వైపు గంగానదికి పుష్కరాలు జరుగుతున్న వేళ.. కేంద్ర హోం మంత్రి అమిత్షా నోరార గంగానదిని అవమానించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్లు పొరపాటున కూడా గంగను తప్పుగా ఉచ్ఛరించరని అంటున్నారు. ఇదేనా హిందూత్వానికి మీరిచ్చే విలువ? అంటూ ప్రశ్నిస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసమని చెప్పుకునే అమిత్షా గంగానదిని ఇంత ఘోరంగా అభివర్ణించటంపై మండిపడుతున్నారు.