హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ఒకపక్క ఎరువుల యాప్తో రాష్ట్రంలోని అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కాసుల వర్షం కురుస్తున్నది. ఎరువుల పంపిణీకి సంబంధించి యాప్ను అమలుచేసినందుకుగాను కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ప్రోత్సాహకం అందించింది. అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థ అమల్లో తొలిదశను పూర్తిచేసినందుకు రూ.175 కోట్ల ప్రోత్సాహకాన్ని మంజూరు చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఫార్మర్ రిజిస్ట్రీని విజయవంతంగా పూర్తిచేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రూ.424 కోట్ల ప్రోత్సాహకాన్ని మంజూరు చేసిందని, తాజాగా అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తిచేయడంతో మరో రూ.175 కోట్ల ప్రోత్సాహకం లభించనున్నదని తెలిపారు.