Regional Ring Road | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగురోడ్డు (RRR) నిర్మాణంలో భాగమైన యుటిలిటీస్ షిఫ్టింగ్కు అయ్యే ఖర్చును భరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిని కేంద్రం తిరస్కరించింది. ఇటీవల రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తిచేసినా ఫలితం లేకుండా పోయింది. భూసేకరణకు అయ్యే ఖర్చుతోపాటు కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, టెలీకాం లైన్లు వంటివి తొలగించేందు(యుటిలిటీస్ షిఫ్టింగ్)కు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. భూసేకరణ వ్యయంలో సగంతోపాటు యుటిలిటీస్ షిఫ్టింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం స్పష్టంచేసింది.
రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తరువాత ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిని గడ్కరీని కలిసి త్రిబుల్ఆర్ ప్రాజక్టును సాధ్యమైనంత త్వరలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పనిలోపనిగా యుటిలిటీ షిఫ్టింగ్కు అయ్యే ఖర్చును కూడా కేంద్రమే భరించాలని కోరారు. కాగా, దీనికి కేంద్రం తిరస్కరించింది. మొదలు చేసుకున్న ఒప్పందం ప్రకారం భూసేకరణ వ్యయంలో సగభాగం, అలాగే యుటిలిటీస్ షిఫ్టింగ్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వారు స్పష్టంచేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 363కోట్ల భారం తప్పే అవకాశం లేదు.