హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ర్టాలపై బీజేపీ దాదాగిరీ చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకాంద ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకొన్నారని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతికి కనీస అవగాహన లేదని, ఆమె తన హోదాను మరిచి రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖే తెలంగాణకు 13 అంశాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించిందని గుర్తుచేశారు. మరోవైపు రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం దుర్మార్గమన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి రాజ్యాంగ సంస్థలను మోదీ, అమిత్ షా దుర్వినియోగం చేస్తూ బీజేపీయేతర రాష్ర్టాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని వివేకానంద అన్నారు. నాలుగు విడతల్లో చేసిన పాదయాత్రతో సంజయ్ ఏం సాధించారని ప్రశ్నించారు. పాదయాత్రల ముగింపు సందర్భంగా కేంద్ర మంత్రులను పిలిపించుకొని రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కడం మినహా ఆయన చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. బండి సంజయ్కి దమ్ముంటే కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన రూ.1 లక్ష కోట్ల బకాయిలను తెప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతల డ్రామాలు శృతిమించాయని అన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఆకాంక్షిస్తుండటాన్ని జీర్ణించుకోలేకనే రాష్ట్రంపై బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. పార్లమెంట్కు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరుపెట్టాలన్న తెలంగాణ అసెంబ్లీ తీర్మానంపై కేంద్రం, బీజేపీ తమ వైఖరిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని చేసినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని తేల్చిచెప్పారు. బీజేపీ ట్రాప్లో అనవసరంగా పడ్డానా? అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మథనపడుతున్నారని, ఆ తప్పుకు ఆయన తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు.
రాష్ట్రంలో అధికారంలో వస్తామని పగటి కలలు కంటున్న బీజేపీకి ఎన్నికల్లో దక్కేది సింగిల్ డిజిటేనని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం స్పష్టం చేశారు. కేంద్రమంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గుజరాత్ మాడ ల్ ఘోరంగా విఫలమైందని, అందుకే తెలంగాణ మాడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు సీఎం కేసీఆర్ను కోరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్నదమ్ముల్లా కలిసి మెలి సి జీవిస్తున్న హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీజేపీ ఆటలు సాగవని స్పష్టం చేశారు. బండి సంజయ్ పాదయాత్రో బీజేపీ నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చాకే సంజయ్ పాదయాత్ర చేపట్టాలని ఎమ్మెల్సే మల్లేశం డిమాండ్ చేశారు.