కరీంనగర్ : కేంద్రలోని బీజేపీ ప్రభుత్వంపై పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోళ్లకు అడ్డుపుల్లలు వేస్తుందని మంత్రి గంగుల విమర్శించారు. కరీంనగర్ మండలం దుర్షేడ్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియా సమవేశంలో మాట్లాడారు.
తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సేకరించిన ధాన్యం వివరాలపై శ్వేత పత్రం విడుదల చేసినా కేంద్రం వివక్ష తగ్గించడం లేదన్నారు. ఎఫ్సీఐ తనిఖీలకు ఇది సమయం కాదన్నారు. ఇప్పుడు తనిఖీలపేరుతో రైస్ మిల్లులను ఇబ్బందులు పెట్టవద్దని, తద్వారా ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది అవుతుందని పదే పదే చెపుతున్నా కేంద్రం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ తనిఖీల వల్ల కొనుగోళ్లలో జరుగుతున్న అలస్యానికి కేంద్రం బాధ్యత వహించాలన్నారు.
కేంద్రం ధాన్యం కొనకుండా కొర్రీలు వేస్తే.. అన్నదాతల సంక్షేమాన్ని కోరుకునే సీఎం కేసీఆర్ పౌరసరఫరాల శాఖకు రూ.3వేల కోట్లు సమకూర్చారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు లేవని బిజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కొత్త గన్నీ బ్యాగులు ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే 8 నుంచి 9 కోట్ల గన్నీ బ్యాగులను సమకూర్చుకుందన్నారు.
ఇవి ఈ నెల 20 వరకు సరిపోతాయన్నారు. కానీ కేంద్రం నుంచి 6.70 కోట్ల గన్నీ బ్యాగులు కావాలని కోరితే.. కేవలం 4.20 కోట్లు మాత్రమే ఇస్తామని చెపుతున్నారని, నిజంగా రైతులపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్కు చిత్త శుద్ది ఉంటే.. గన్నీ బ్యాగులు యుద్ధ ప్రాతిపదికన ఇప్పించాలని డిమాండ్ చేసారు.
కోనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదంటూ మరో ఆరోపణ చేస్తూ.. రైతులను ఆగం చేసే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి.
ఈ సీజన్లో 6,811 కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా.. ఇప్పటికే 3,525 ప్రారంభం ఆయ్యాయని తెలిపారు. వీటి ద్వారా ఈ నెల 3 నాటికి 55,600 మంది రైతులనుంచి 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఈ లెక్కలు తెలియకుండా గుడ్డిగా మాట్లాడుతున్నారని, నేను చెప్పిన దాంట్లో ఎదైనా తప్పు ఉంటే దేనికైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
కేంద్రం ఎన్ని కొర్రీలు వేసినా.. సీఎం కేసీఆర్ ధాన్యంకొంటున్నారని, తద్వారా రైతులు టీఆర్ఎస్కు మద్దతగా ఉన్నారని భావిస్తూ ఎఫ్సీఐ బృందాలతో తనిఖీలు చేపిస్తుందన్నారు. తెలంగాణ రైస్మిల్లులపై జరుగుతున్న దాడుల్లో వంద శాతం బిజేపీ రాజకీయ కోణం ఉందన్నారు. ఎఫ్సీఐ చరిత్రలో ఇలాంటి తనిఖీలను చూడలేదన్నారు. ఇప్పుడే ఎందుకు చేస్తుందో చెప్పాలన్నారు. అంతేకాదు.. వారికి సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.