హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణను ఆర్థికంగా అస్థిర పరిచేందుకు యత్నిస్తున్నది. చట్టబద్ధంగా రావాల్సిన నిధులనూ ఇవ్వకుండా వేధిస్తున్నది. దేశంలోని చిన్న రాష్ర్టాల్లో ఒకటైన తెలంగాణ స్వయం సమృద్ధితో పెద్దరాష్ర్టాలకు దీటుగా నిలుస్తుండడాన్ని కేంద్రం జీర్ణించుకోలేక పోతున్నది. అందుకే, తెలంగాణను అణగదొక్కేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది.
పన్నుల వాటాలో భారీ కుదింపు
2022-23లో కేంద్ర పన్నుల వాటాగా తెలంగాణకు 18 వేల కోట్లకుపైగా అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వే సింది. కేంద్రం దీన్ని 12,407 కోట్లకు కుదించింది. డిసెంబర్ వరకు 8,381 కోట్లు మాత్ర మే ఇచ్చింది. ఇంకా 4,026 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 2 నెలల్లోగా ఆ నిధులు రావాల్సి ఉన్నది. వెనుకబడిన ప్రాం తాల అభివృద్ధి నిమిత్తం గత రెండేండ్లలో 900 కోట్లు అందాల్సి ఉన్నది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కోసం రాష్ట్రానికి రూ.25,555 కోట్లు అందించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసి ఏండ్లు గడిచినా.. కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నది.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ 18 శాతమే
ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం నుంచి రాష్ర్టానికి 41,001 కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. కానీ, డిసెంబర్ చివరి నాటికి 7,770 కోట్లు మాత్ర మే వచ్చాయి. ఇంకా రూ.33,231 కోట్లు రావాల్సి ఉన్నది. అంటే, గత 9 నెలల్లో తెలంగాణకు వచ్చిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు 18% మాత్రమే.
ఆంక్షలతో రుణాలకు కత్తెర
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ.52,167 కోట్ల రుణాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేయగా.. డిసెంబర్ వరకు రూ.29,008 కోట్లు మాత్రమే అందాయి. కేంద్రం ఆంక్షలే ఇందుకు కారణం. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ల ద్వారా తీసుకునే బడ్జెటేతర రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేర్చేవారు కాదు. కానీ, ఆ రుణాలన్నీ ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వస్తాయని కేంద్రం గత ఆర్థిక సంవత్సరంలో స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర రుణ పరిమితిపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్ర ప్రభుత్వం 21-22లో తీసుకున్న బడ్జెటేతర రుణాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేండ్లపాటు ఎఫ్ఆర్బీఎం పరిమితిలో తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న రుణాలనూ పరిగణనలోకి తీసుకోవడంతో తెలంగాణ రుణ పరిమితిలో భారీగా కోత పడింది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకూ ఏటా రాష్ర్టానికి రూ.8,814.25 కోట్ల చొప్పున ఎఫ్ఆర్బీఎం రుణాలు తగ్గనున్నాయి. కేంద్రం ఆంక్షల వల్ల తెలంగాణ రూ.35,257 కోట్లు నష్టపోవాల్సి వస్తున్నది. ఈ మూడు అంశాలు ఈసారి తెలంగాణ బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.