హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని రానున్న ఉప ఎన్నికలో ఓడించి గుణపాఠం నేర్పించాలని తెలంగాణ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సంఘం కన్వీనర్ వి.దానకర్ణాచారి పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన బీమా, రక్షణ రంగాలను కూడా ప్రైవేటుపరం చేస్తూ దేశ భద్రత, ప్రజల సొమ్మును ప్రమాదంలో పడేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం చేస్తున్నదని వి.దానకర్ణాచారి ఆరోపించారు. గత బడ్జెట్లో కార్పొరేట్ కంపెనీలకు రూ.1.15 లక్షల కోట్ల మేర రాయితీలు ప్రకటించి.. ఇప్పుడు ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో నెలకొల్పిన వైజాగ్ స్టీల్ ప్లాంట్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, బీఈఎంఎల్, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ తదితర సంస్థలను అంబానీ, అదానీ, టాటా, ఎల్ అండ్ టీ వంటి సంస్థలకు కట్టబెట్టేందుకు చూస్తున్నదని ఆరోపించారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు రిజర్వేషన్లు కూడా అందకుండా పోతాయన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించి గుణపాఠం చెప్పాలని దానకర్ణాచారి పిలుపునిచ్చారు.