హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది కేంద్ర భారత్మాల పథకం పనులు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం ఏండ్ల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. గోల్నాక నుంచి రామంతపూర్ వరకు, ఉప్పల్ రింగు రోడ్డు నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పౌరులు కేంద్ర బీజేపీ సర్కారు పనితీరును తుర్పారపట్టారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ ఎప్పటి వరకు పూర్తవుతుంది? ఉప్పల్-నారపల్లి వరకు ప్రతి రోజూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆదివారం ట్విట్టర్ వేదికగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును అడిగారు.
దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ నగరంలో ఉప్పల్, అంబర్పేటలో చేపడుతున్న ఫ్లై ఓవర్లు జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తున్నదని వెల్లడించారు. ఈ రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ అనుకున్న సమయంలోనే భూ సేకరణ పూర్తి చేసిందని చెప్పారు. ఇదే సమయంలో సిటీలో ఎస్ఆర్డీపీ పథకం కింద 35 ప్రాజెక్టులను పూర్తి చేశామని, కానీ కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని రెండు ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఇది సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి ఉన్న తేడా అని కేటీఆర్ చురక అంటించారు. మంత్రి కేటీఆర్ ట్వీట్తో అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు కేంద్రప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు వంతెనల పనులు కొనసాగుతుండటంతో ప్రజల నరకయాతనను అనుభవిస్తున్నారు. దీనికి బాధ్యత తీసుకుంటూ ‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. ఐనా అంబర్పేట ప్రజల వద్దకు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడగటానికి వస్తావు కిచేనాల కిచెన్ అన్నా’.. అంటూ అంబర్పేట అనిల్ గౌడ్ ప్రశ్నించారు. శివరాంపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ఇదే తరహాలో జాతీయ రహదారుల సంస్థ నిర్లక్ష్యం చేస్తున్నదని మల్లికార్జున్ విశ్వనాథం మండిపడ్డారు. గత ఏడాది నుంచి పనుల్లో కనీస పురోగతి లేదని ఆయన మండిపడ్డారు. పై వంతెన పనులు తీవ్రంగా జాప్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రిపై తీవ్రస్థాయిలో నెటిజన్లు విరుచుపడ్డారు.
రాష్ట్ర నిధులతో జెట్ స్పీడ్తో పనులు
ఉప్పల్-రామంతాపూర్ రోడ్డులో ైప్లెఓవర్ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.411 కోట్లు కేటాయించింది. నిరుడు మార్చి 10న మంత్రి కేటీఆర్ పనులు ప్రారంభించారు. వెంటనే రామంతాపూర్ రోడ్డులో చకచకా పిల్లర్స్ పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం మేర పనులు పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయటంతోపాటు, పనులు సత్వరం చేయటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక మచ్చుతునక నాలుగేండ్లలో 35 ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా మొదటి దశలో రూ.8092 కోట్లతో 48 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 35 చోట్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. 19 ఫ్లై ఓవర్లు, 5 అండర్పాస్లు, ఎనిమిది ఆర్వోబీ/ఆర్యూబీలు, ఒక కేబుల్ బ్రిడ్జి, ఒక విస్తరణ బ్రిడ్జి, ఓఆర్ఆర్ నుంచి మెదక్ జంక్షన్ వరకు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అందుబాటులోకి వచ్చిన చోట ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయింది. ప్రయాణం సాఫీగా జరగటంతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతున్నది.