హైదరాబాద్ : కేంద్రం నిర్ణయంతో తెలంగాణ అభివృద్ధిపై ప్రభావం పడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక
కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శులు, పిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీలతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం, 2022-23 సంవత్సరానికి రాష్ట్రాలు రుణాలు తీసుకునే మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల కోసం ఓ నోడల్ ఏజెన్ మోడల్ తదితర అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితులకు అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి నిధులను సమకూర్చుకొని.. ఆ అప్పులను రాష్ట్రాల నిధుల నుంచి చెల్లిస్తున్నాయని, ఆ అప్పులను రాష్ట్రాల అప్పులుగానే భావిస్తామని పేర్కొంది.
తెలంగాణ తరఫున సమీక్షకు ఆర్థికశాఖ అధికారులు రామకృష్ణారావు, జీఆర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపించారు. 2022-23లో రుణాలకు రాష్ట్రానికి అనుమతి ఇవ్వకపోవడంపై అధికారుల నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ బయటి అప్పులను రాష్ట్రాల అప్పులుగా తీసుకోవడం కక్షపూరిత చర్యగా పేర్కొన్నారు. నిబంధనల పేరిట అప్పుల కోసం బంధనాలు వేస్తున్నారని, దీన్ని తెలంగాణపై కేంద్రం చూపే వివక్షగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంతో అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుందని, తెలంగాణ ఆర్థిక వనరులను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు.
15వ ఆర్థిక సంఘం చెప్పని విషయాలను పేరిట అమలు సరికాదని చెప్పారు. కేంద్రం నిర్ణయం తెలంగాణ వివక్షపూరిత చర్యగా భావిస్తామని, కొత్త నిబంధనలను ప్రస్తుత ఆర్థిక ఏడాది నుంచే అమలు చేయాలని స్పష్టం చేశారు. 2020-21 నుంచి అమలు చేయడం అత్యంత కక్షపూరిత చర్య అని, అప్పు తీసుకునేందుకు తెలంగాణకు వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పులకు అనుమతించకపోతే రాష్ట్రాభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతుందని, కేంద్రం పాటిస్తున్న నిబంధనలనే తెలంగాణ పాటిస్తుందని చెప్పారు. కేంద్రం పాటిస్తున్న నిబంధనలనే తెలంగాణ పాటిస్తున్నది అప్పులు తెచ్చుకునేందుకు తెలంగాణకు అనుమతి ఇవ్వాలని కోరారు.