హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లలో అయోమయం నెలకొన్నది. ఉప ఎన్నిక కోసం ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఇప్పటికే ఓటర్లుగా నమోదు చేసుకున్నవారు తాము మళ్లీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా? లేదా అనే గందోరగోళం నెలకొన్నది. దీంతో ఇప్పటి వరకు తక్కువ సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. గతంలో 5.05 లక్షల ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఓటు హక్కు కోసం కేవలం 60 వేల మంది మాత్రమే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నారు. నల్లగొండ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ ఎమ్మెల్యే విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నిర్వహణలో భాగంగా డిసెంబర్ 29న ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి 6వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ముసాయిదాపై మార్చి 14 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
మరోసారి నమోదు చేసుకోవాల్సిందే
గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కును మరోసారి నమోదు చేసుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తున్నది. ఉప ఎన్నిక అయినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నది. మూడు జిల్లాల పరిధిలో సాధారణ ఓటు హక్కు ఉన్న వారు డిగ్రీ పూర్తి చేసి మూడేండ్లు అయిన వారు తమ సంబంధిత పత్రాలతో ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని ఈసీ స్పష్టంచేస్తున్నది.