EC | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : త్వరలో జరగబోయే సార్వత్రిక, కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల సంఘం అధికారుల బదిలీల విషయంలో శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను తమకు అనుకూలంగా మలచుకోకుండా అధికారుల బదిలీల విధానాన్ని ఈసీ సర్దుబాటు చేసింది. విధాన నిర్ణయాలలో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పొరుగు జిల్లాలకు అధికారులను బదిలీ చేయవచ్చునని, అయితే వారి పోస్టింగ్ ఇంతవరకు వారున్న పార్లమెంట్, అసెంబ్లీ పరిధిలో ఉండకుండా చూసుకోవాలని, బదిలీల స్పూర్తి ఇదేనని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల బదిలీల విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ ప్రకటించింది. దీని ప్రకారం సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారితో పాటు తాము పనిచేస్తున్న చోట మూడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులు ఆయా పార్లమెంట్, అసెంబ్లీ పరిధిలోని జిల్లాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి.
పోటీలో ఉన్న అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించకుండా నివారించడానికే ఈ బదిలీలు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. అయితే ఇది కేవలం రెండు లోపు పార్లమెంటరీ నియోజకవర్గాలున్న రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించదని వివరించింది. ఈ ఆదేశాలతో తెలంగాణలో స్పల్ప సంఖ్యలో మరోసారి బదిలీలు జరిగే అవకాశం ఉంది.