హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా ఎనిమిదేండ్ల నుంచి కాలయాపన చేస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రజాప్రతినిధులు స్వయంగా కలిసి విన్నవించినా ఖాతరు చేయడంలేదు. ఎన్ని లేఖలు రాసినా జవాబివ్వడంలేదు. న్యాయశాఖ అభిప్రాయాన్ని సేకరిస్తున్నామంటూ కాలం వెల్లదీస్తున్నది. తెలంగాణ సహనాన్ని పరీక్షిస్తున్నది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. కృష్ణా, గోదావరి జలాలను కేవలం ప్రాజెక్టులవారీగానే పంపిణీ చేయాలని నాటి కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు రిఫర్ చేసింది. అలా చేస్తే తెలంగాణకు ఒరిగేదేమీ ఉండదని, ఉద్యమంలో ప్రతిధ్వనించిన న్యాయమైన నీళ్ల వాటా ఆకాంక్ష నెరవేరబోదని యావత్తు తెలంగాణ సమాజం ఆనాడే వ్యతిరేకించింది.
పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటాలను తేల్చాలని పదేపదే డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఈ డిమాండ్ను నరేంద్రమోదీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో రాష్ట్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ పట్టుబట్టడంతో ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. కానీ, కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలా? లేక సెక్షన్ 3 ప్రకారం నీటి వాటాలను తేల్చే అధికారాన్ని ప్రస్తుతమున్న బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కే కల్పించాలా? అనేదానిపై న్యాయశాఖ సలహాను తీసుకోవాలని నిర్ణయించింది. అందులో కూడా మరో మెలిక పెట్టింది. ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని, ఆ తర్వాతే న్యాయసలహా కోరతామని తెలంగాణ ప్రభుత్వానికి షరతు విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును గత ఏడాది సెప్టెంబర్లోనే ఉపసంహరించుకొన్నది. ఇది జరిగి దాదాపు ఏడాది గడుస్తున్నా కేంద్రం ఉదాసీన వైఖరినే కొనసాగిస్తున్నది. ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిష్కరిస్తామని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిరుడు అక్టోబర్లో పత్రికాముఖంగా ప్రకటించినా ఆ అంశం ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయింది.
ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నదని, తద్వారా రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నదని తెలంగాణ సాగునీటి ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులోని పిటిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిన అవసరమే లేదని, కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసినా లేక రిఫర్ చేసినా తెలంగాణ పిటిషన్ ఆటోమ్యాటిక్గా నిర్వీర్యమయ్యేదని న్యాయకోవిదులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను ఉపసంహరించుకొని ఎనిమిది నెలలు గడిచినా ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. అసలు ట్రిబ్యునల్ ఏర్పాటుపై మోదీ సర్కారు న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరి ఉంటే ఇప్పటికే తెలంగాణకు స్పష్టమైన జవాబిచ్చేదని వాదిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ఎలా ముందుకు సాగాలన్నదానిపై న్యాయకోవిదులతో సంప్రదింపులు జరుపుతున్నది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.