కరీంనగర్ : రైతుల అవసరాలను, వారి ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడూ గుర్తించి పరిష్కరిస్తుండడంతో రాష్ట్రంలో ధాన్యం సాగు గణనీయంగా పెరిగిందని సివిల్ సప్లైశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని నగునూర్, చామనపల్లి, చర్లబుత్కూర్, దుర్శేడ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కర్ణన్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యావత్ దేశానికి, ప్రపంచానికి ఆహార ధాన్యాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. శ్రీలంక దేశం ఎదుర్కొన్న ఆహార సంక్షోభాన్ని చూసైనా కేంద్రం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కేంద్రం వద్ద నిల్వల కొరత ఏర్పాడ్డాయని దుయ్యబట్టారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణకు కేంద్రం అనేక కొర్రీలు పెట్టినా ప్రతీ గింజను కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. రాష్ట్రంలో గత వానాకాలంలో పండిన కోటీ యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో యాభై లక్షలు ఇతర అవసరాలకు పోనూ కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు.
2014కు ముందు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ జరుగగా నేడు కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గర్వకారణమన్నారు. పంట పండాలంటే అవసరమైన నీళ్లు, పెట్టుబడి, కరెంటు, ఎరువులు సకాలంలో సీఎం కేసీఆర్ అందిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6713 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించగా ఇప్పటివరకూ 1545 కేంద్రాలు ప్రారంభించి దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. నిధుల కొరత లేదని, గన్నీబ్యాగ్లు, ప్యాడీక్లీనర్లు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.
పక్క రాష్ట్రాల్లో పండించిన ధాన్యం తెలంగాణకు వచ్చే అవకాశం లేకుండా పకడ్బందీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్యలో ఊపందుకుంటాయని మంత్రి గంగుల కమలాకర్వెల్లడించారు. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ శ్యాముల్, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.