‘ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించవద్దు’ అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇటీవలే సుప్రీంకోర్టు చురకలు అంటించింది. అయినా కేంద్రంలోనీ బీజేపీ సర్కారు తీరు మారట్లేదు. యూనిక్ ఎకనమిక్ అఫెండర్ కోడ్ (యూఏవోసీ) పేరిట తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని భయపెట్టేందుకు కొత్త కుట్రకు తెర తీసినట్టు వాదనలు వినిపిస్తున్నాయి.
UAOC | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలకు ఒక ప్రత్యేక నంబర్ (యూనిక్ ఎకనమిక్ అఫెండర్ కోడ్-యూఏవోసీ)ను కేటాయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈ నంబర్కు సదరు వ్యక్తి ఆధార్ (కంపెనీ అయితే పాన్ నంబర్)ను అనుసంధానించనున్నారు. అంటే ఒక విధంగా జైల్లో ఖైదీలకు ఎలాగైతే నంబర్ను కేటాయిస్తారో అలా ఇస్తారన్న మాట! కేంద్ర ఆర్థిక శాఖలో సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో డాటా బేస్లో 2.5 లక్షల ఆర్థిక నేరగాళ్లు, నిందితుల సమాచారం ఉన్నట్టు అంచనా. వీరందరికీ యూఏవోసీ నంబర్లను కేటాయించనున్నారు. ఈ నంబర్ సాయంతో సదరు వ్యక్తులపై వచ్చిన అభియోగాలు, అప్పటికే నమోదు చేసిన చార్జిషీట్ల సమాచారాన్ని సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు సులభంగా తెలుసుకోవచ్చు. వివిధ ఏజెన్సీలు కేసు దర్యాప్తును సమాంతరంగా, త్వరితగతిన కొనసాగించవచ్చు.
నంబర్ కేటాయింపు ఇలా..
యూఏవోసీ నంబర్ సిస్టమ్ జనరేటెడ్ కోడ్. ఇది ఆల్ఫా-న్యూమరిక్ (ఇంగ్లిష్ అక్షరాలు, అంకెలతో కూడిన కోడ్) సమాహారంగా ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తిపై ఈ కోడ్ జనరేట్ అయితే, ఆ వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు, రుజువైన నేరాలన్నీ డాటాగా రికార్డవుతుంది. దర్యాప్తు సంస్థలు లేదా పోలీసులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినప్పటికీ, ఆ వ్యక్తికి ఈ నంబర్ను కేటాయిస్తారని ప్రాథమిక సమాచారం. నేషనల్ ఎకనమిక్ అఫెన్స్ రికార్డ్స్ (ఎన్ఈవోఆర్) డాటాబేస్లో రికార్డవుతుంది. నేరం రుజువు కాకపోయినప్పటికీ, అతని సమాచారం ముందస్తుగా అఫెన్స్ రికార్డ్స్ డాటాబేస్లో నమోదవుతుంది.
దోషిగానే పరిగణన?!
మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి తప్పనిసరిగా తాను నిర్దోషి అని కోర్టులో స్వతహాగా నిరూపించుకోవాలి. ఎందుకంటే పీఎంఎల్ఏ చట్టంలో కేసు తేలేవరకూ కోర్టు నిందితుడిని దోషిగానే భావిస్తుంది. ఇప్పుడు యూఏవోసీ నంబర్ కేటాయించిన వ్యక్తి కూడా తాను నేరాన్ని చేయలేదని నిరూపించుకొనేవరకూ అతన్ని దోషిగానే పరిగణించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కేంద్రంలోని బీజేపీ సర్కారు యూఏవోసీ కోడ్ను తీసుకొస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు, హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. మరో నాలుగైదు నెలల్లో ఈ కోడ్ అమల్లోకి రానున్నట్టు సమాచారం.