Devadula Project | వరంగల్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నదుల అనుసంధానం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. బీజేపీ సర్కార్ ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ఆనకట్ట ఇప్పుడు సమ్మక్కబరాజ్ (తుపాకులగూడెం)ను ఉపయోగించుకోలేని పరిస్థితిని సృష్టిస్తున్నది. దీంతో వరంగల్ జిల్లాలో సాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
గోదావరి జలాలను కావేరి నదికి తరలించేందుకు చేస్తున్న ఈ వ్యవహారం గోదావరి పక్కనున్న ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు శాపంగా మారనున్నది. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లపాటు ఎంతో శ్రమించి ప్రతి ఎకరాకు సాగునీటి వసతి కల్పించేందుకు చేసిన మంచి పనులు కేంద్ర ప్రతిపాదనతో బూడిదలో పోసిన పన్నీరులా మారే ప్రమాదం ఏర్పడింది.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ఆయకట్టును పెంచడంతోపాటు అప్పటివరకు ఉన్న ఆయకట్టును స్థిరీకరించింది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఏడాది పొడవునా తాగునీరు, రెండు పంటలకు సాగునీరు అందించేందుకు వీలుగా దేవాదుల పంపుహౌజ్ వద్ద నిత్యం నీళ్లు ఉండేలా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సమ్మక్క బరాజ్ను నిర్మించింది. గోదావరి నదిపై మేడిగడ్డ దిగువన 30 కిలోమీటర్ల సమీపంలో ఇచ్చంపల్లి బరాజ్ ప్రతిపాదిత ప్రదేశం ఉంటుంది.
ఇచ్చంపల్లి నుంచి 20 కిలోమీటర్ల దిగువన గంగారం వద్ద దేవాదుల పంపుహౌజ్ ఉన్నది. ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దిగువన సమ్మక్క బరాజ్ను నిర్మించారు. దీని నిర్మాణంతో బరాజ్ నుంచి దేవాదుల పంపుహౌజ్ వరకు పది కిలోమీటర్ల మేర నీళ్లు నిల్వ ఉంటాయి. ఏడాది పొడవునా దేవాదుల వద్ద పంపింగ్కు సరిపడా నీటి నిల్వలు ఉంటున్నాయి.
తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్రం ప్రతిపాదిస్తున్న ఇచ్చంపల్లి బరాజ్ను నిర్మిస్తే, తుపాకులగూడెం బరాజ్లో నీళ్లు ఉండవు. అదే జరిగితే దేవాదుల ప్రాజెక్టు, దీని కోసం నిర్మించిన సమ్మక్క బరాజ్ నిరుపయోగంగా మారుతాయి. నదుల అనుసంధానం స్ఫూర్తికి విరుద్ధంగా మహానది నుంచి గోదావరికి మిగులు జలాలను తరలించకుండానే, గోదావరి నుంచి కావేరికి నీటిని తరలించేలా అనుసంధాన ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్రం సిద్ధంచేసింది. తాగునీరు, సాగునీటి వసతులను పెంచేందుకు కృషిచేయాల్సిన కేంద్రం గోదావరి నది పక్కన ఉన్న ప్రాంతాలను ఎండబెట్టి, ఎక్కడో ఉన్న తమిళనాడుకు నీటిని తన్నుకుపోయే ప్రతిపాదనలు చేయడంపై సాగునీటిరంగ నిఫుణులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్తో సాగునీటిరంగంలో కొత్త శకం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగునీటి రంగంలో కొత్త శకం మొదలైంది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది. దేవాదుల, ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో సమ్మక్క బరాజ్ను 2017లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారు. 2017 ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం రూ.2,121 కోట్ల నిధులను మంజూరు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2020 ఏప్రిల్ 22, 2020 అక్టోబర్ 13న రెండు దశలకు వేర్వేరుగా పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. అప్పటినుంచి పనులు వేగంగా జరిగాయి.
ఈ బరాజ్ను 6.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. 14 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడం లక్ష్యంగా, 59 రేడియల్ గేట్లతో 1,143 మీటర్ల పొడవుతో ఈ బరాజ్ను నిర్మించారు. రూ.1,829 కోట్ల పనులు అయ్యాయి. తుపాకులగూడెంపై గంగారం వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ఎత్తిపోతల ద్వారా దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది.
సమ్మక్క బరాజ్ నిర్మాణంతో దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని హనుమకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లోని 6.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి వసతి ఏర్పడింది. దీంతోపాటు ఎస్సారెస్పీ పరిధిలోని 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయింది. సాగునీటితోపాటు వరంగల్ మహానగరం సహా ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతున్నది.
ఏడాది పొడవునా ఉండేలా
ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు నీళ్లు లేకుండా దేవాదుల ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టి, అలాగే పూర్తి చేసుకుంటూ పోయాయి. పదేండ్ల క్రితం వరకు దేవాదుల పంపుహౌజ్ల వద్ద గరిష్ఠంగా ఏడాదిలో మూడు నెలల కంటే ఎక్కువ రోజులు నీళ్లు ఉండేవి కావు. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం 71 మీటర్లు ఉన్నప్పుడే మోటర్లతో నీళ్లను ఎత్తిపోసే పరిస్థితి ఉండేది. వానలు బాగా పడే రోజుల్లో మాత్రమే ఈ మేరకు నీటిమట్టం ఉంటుంది. వానకాలంలో గోదావరి నదిలో వరద ఉన్నప్పుడే మోటార్లు నడిచేవి.
ఈ మోటర్లతో నీళ్లు రిజర్వాయర్లకు, అక్కడి నుంచి పొలాలకు చేరుతాయి. దేవాదుల పంపుహౌజ్ వద్ద గరిష్ఠంగా మూడు నెలలే 71 మీటర్ల మేరకు నీటి మట్టం ఉండేది. వానలు తక్కువగా ఉన్నా, గోదావరిలోకి వరద లేకున్నా నీటి ఎత్తిపోతల జరిగేది కాదు. గోదావరిలో పంపింగ్కు సరిపడా నీటి నిల్వ లేకపోవడంతో చాలా సీజన్లలో వానకాలం పంటలకు సైతం సాగునీరు అందలేదు. ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు రెండు పంటలకు కచ్చితంగా సాగునీరు అందించాలని కేసీఆర్ ప్రభుత్వం తుపాకులగూడెం వద్ద సమ్మక్క బరాజ్ను నిర్మించాలని నిర్ణయించింది.
83 మీటర్ల మేరకు నీటిని నిల్వ చేసేలా 92 మీటర్ల ఎత్తుతో బరాజ్ను నిర్మించింది. దీంతో ఏడాది పొడవునా 71 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంటున్నది. దేవాదుల, ఎస్సారెస్పీ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందుతున్నది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో నిర్మించిన ఈ బరాజ్ను పూర్తిగా నిరుపయోగంగా మార్చే విధంగా అదే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమిళనాడులో తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చంపల్లి బరాజ్ ప్రతిపాదనను తెర మీదకు తెచ్చింది.
‘ఎస్సారెస్పీ పునరుజ్జీవంతో వరంగల్ ఉమ్మడి జిల్లా మీదుగా సూర్యాపేట, తుంగతుర్తి చివరి ఆయకట్టు వరకు నీటి కొరత తీరింది. దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా వరంగల్ పాత జిల్లాకు అంకితం చేస్తాం.’
– 2021 మే 21న వరంగల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్