రంగారెడ్డి/బడంగ్పేట, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలకు నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఒప్పించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ పట్టుదలతో కృషి చేయడం వల్లే ఈ పథకానికి ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. మీర్పేట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సాగునీటి వసతి తక్కువగా ఉన్న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో బోర్లపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారని, దశాబ్దం కలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్ను ఈ ప్రాంత ప్రజానీకం ఎప్పటికీ మరిచిపోరని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.