‘పకోడా అమ్ముకోవడం కూడా మా ఉద్యోగ కల్పనలో భాగమే’2018 జనవరిలో పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్న మాటలివి. ‘ఏటా రెండు కోట్ల ఉద్యోగాలంటివి సామీ.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తివ’ని లోక్సభలో ఎంపీలంతా ముక్తకంఠంతో నిలదీస్తే మోదీ నోటి నుంచి వచ్చిన చిలుకపలుకులివి. రోడ్డుమీద పకోడా బండి పెట్టుకొని అమ్ముకొనే గొప్ప పరిస్థితులు కల్పించడం కూడా ఉద్యోగ కల్పనలో భాగమేనని సాక్షాత్తూ ప్రధానులవారు సెలవిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపైన మొసలి కన్నీరు కారుస్తున్న బీజేపీ నేతల అధినేత మోదీకి నిరుద్యోగులపైన, ఉద్యోగితపైన ఉన్న మహా గొప్ప అభిప్రాయం.
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఉద్యోగాల్లో మంజూరైన పోస్టులే 40 లక్షలు.. కానీ ఏకంగా రెండు కోట్ల పోస్టులు భర్తీ చేస్తమని గప్పాలు కొడతరు. గప్పాల ముచ్చట సరేసరి.. ఉన్న ఖాళీలైనా భర్తీ చేస్తరా అంటే లక్షల కొద్దీ ఖాళీగా ఉంటాయి. కానీ నియామకాలు జరుగవు. మరోవైపు రత్నాల్లాంటి ప్రభుత్వ రంగసంస్థలను అడ్డగోలుగా మూసేసి లక్షల ఉద్యోగులను రోడ్డున పడేస్తారు. కోట్ల మందికి ఉపాధి కల్పించే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి తోడ్పాటు అందించరు. ఏటా రెండున్నర లక్షల పోస్టులు ఖాళీ అవుతూనే ఉంటాయి. వాటినట్లనే ఖాళీగా ఉంచుతుంటరు. ఒక్క పోస్టు కూడా భర్తీచేయరు. పైగా కారడ్డం మాటలు మాట్లాడుతుంటరు. రాష్ట్రంలో పార్టీ ఆఫీసుల్లో కూర్చొని కొంగజపాలు చేస్తుంటారు.
నినాదాలకే కేంద్రం పరిమితం
తాము అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామంటూ 2014లో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చాక ఆ హామీలేమయ్యాయో మోదీకే ఎరుక. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా.. ఇట్లా ఆర్నెల్లకో నినాదం. నినాదానికో కొత్తపేరు. వీటివల్ల ఎంతమందికి ఉద్యోగాలొచ్చాయి.. ఉపాధి లభించిందంటే భూతద్దం పెట్టి వెతకాల్సిందే. దీనికితోడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను అమ్మకానికి పెట్టింది. లక్షల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఏటా రెండున్నర లక్షల ఖాళీలు ఏర్పడుతున్నాయి. గత ముప్ఫై ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా.. హెచ్చుతగ్గులు లేకుండా కొనసాగుతున్న నిరుద్యోగ శాతం మోదీ పాలనలో ఏకంగా రెండింతలు పెరిగిపోయింది. 2014లో 3.3శాతంగా ఉన్న నిరుద్యోగం 2020 అక్టోబర్ నాటికి 7.2 శాతానికి పెరిగిపోయిందంటేనే మోదీ సర్కారు నిర్వాకమేమిటో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో మంజూరైన ప్రతి ఐదు పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2014-15 నాటికి 52 కేంద్ర సర్వీసుల్లో మొత్తంగా మంజూరైన పోస్టుల్లో 11.45% ఖాళీలు ఉండగా, 2020-21 నాటికి అవి 22.69%కి పెరిగినట్టు నివేదకలే స్పష్టం చేస్తున్నాయి.
2020 మార్చి 1 నాటికి మంజూరైన మొత్తం కేంద్ర ఉద్యోగాల సంఖ్య 40,04,941 కాగా, వీటిలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు 31,32,698 మంది కాగా ఖాళీగా ఉన్నవి 8,72,243 పోస్టులు. సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రైల్వేలూ నిర్వీర్యం
రైల్వే రిక్రూట్మెంట్బోర్డు దేశవ్యాప్తంగా 16 జోన్లలోని గ్రూప్ డీ ఖాళీలను 1,03,769 పోస్టులను భర్తీకి 2019 మొదట్లో నోటిఫికేషన్ జారీచేసింది. ఆ పోస్టులకు కోటి మందికిపైగా దరఖాస్తు చేసుకొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చి మూడేండ్లు గడిచాయి. కనీసం పరీక్ష కూడా నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు.
మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఇదీ దుస్థితి..
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో నిరుద్యోగుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నది. రాష్ర్టాన్ని గత 20 ఏండ్లుగా పాలిస్తున్నది బీజేపీనే. ఇటీవల గుజరాత్ ప్రభుత్వం 9,902 గ్రామ రక్షకదళ్ వలంటీర్ల పోస్టులకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తే, 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటేనే అక్కడ నిరుద్యోగమెలా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు. ఈ గ్రామ రక్షక్ దళ్ వలంటీర్ విధి ఏమిటంటే పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్కు సహాయకారిగా ఉండటమే. పైగా రోజువారీ వేతనం రూ.230. కనీస వేతనానికి రూ.69 తక్కువే.
మొర పెట్టుకొంటున్నా పట్టించుకోరు
తమ శాఖల్లో ఖాళీలను భర్తీచేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులు ఏండ్లుగా మొరపెట్టుకొంటున్నా మోదీసర్కారు పట్టించుకోని పరిస్థితి. గత అక్టోబర్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్భూషణ్ ఏకంగా పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్ అండ్ అడిషనల్ సెక్రటరీ దీప్తి ఉమాశంకర్కు లేఖ రాయడం వివాదాస్పదమైంది కూడా. వైద్యారోగ్యశాఖలోని సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్లలో ఉన్న అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్స్, డిప్యూటీ సెక్రటరీ పోస్టులతోపాటు అనేక ఇతర గ్రేడ్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నదని, ఖాళీలను భర్తీచేయాలని ఆయన మొరపెట్టుకొన్నారు. అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి. అయినా మోదీ సర్కారు చెవికి వారి మొర ఎక్కడంలేదు. న్యాయశాఖలో, ట్రిబ్యునళ్లలో ఉన్న ఖాళీలపై గత ఆగస్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం స్వయంగా స్పందించారు. ఖాళీల భర్తీని చేపట్టకుండా ట్రిబ్యునళ్లను మూసేయాలనుకొంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారంటే ఉద్యోగాల నియామకాలపై బీజేపీ తీరును అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యమైన పాయింట్లు