హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): సింగరేణిలాంటి సంస్థ ఆధారపడేదే బొగ్గు గనులపై. అలాంటి సంస్థకు బొగ్గు బ్లాకులే ఇవ్వకుంటే.. సింగరేణి ఏం పనిచేయాలి? పనే లేకపోతే దాని మనుగడ ఎట్లా? తెలంగాణ సిరులగనిని పనిగట్టుకుని మూతపడేసేలా కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతున్నది. సంస్థను ప్రైవేటీకరించబోమని, తమకు కేవలం 49 శాతం వాటా మాత్రమే ఉందని ప్రధాని మోదీ ఓ వైపు చెప్తుంటే.. మరోవైపు ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం సంస్థ భవిష్యత్తుకు ఉరితాడు పేనుతున్నది. బొగ్గు బ్లాకులు కేటాయించకుండా సింగరేణిని నిర్వీర్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలోని బొగ్గుబ్లాకులనైనా పూర్తిగా సింగరేణికి కేటాయించడం లేదు. మొత్తం 82 బొగ్గు బ్లాకులకుగాను కేవలం 40 మాత్రమే సింగరేణికి కేంద్రం కేటాయించింది. సింగరేణిని చంపేందుకే కేంద్రం భారీ కుట్ర చేస్తున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. సంస్థను ప్రైవేటీకరించబోమంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్జోషి సోమవారం ట్విట్టర్లో ప్రకటించగా.. వినోద్ ఘాటుగా స్పందించారు.
కేంద్రమంత్రివి అబద్ధాలు..
బొగ్గు గనుల కేటాయింపు, పీఎస్యూల ప్రైవేటీకరణ మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. సింగరేణిలో 51 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉంది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇదే విషయాన్ని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించడానికి కేంద్రం నిర్ణయం తీసుకోదు. అది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదు. గనుల వేలం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం వేలానికి విముఖత చూపి, ఒక్క బ్లాక్కూడా కేటాయించకుండా ఉండటం రాష్ట్ర అభివృద్ధికి విఘాతం. మోదీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం అభివృద్ధి, ఆదాయం కోసం బ్లాక్లను వేలం వేయడానికి రాష్ర్టాల తరఫున చర్యలు తీసుకుంటున్నారు. ఇది బాధ్యతాయుతమైన సుపరిపాలనకు సంకేతం అంటూ.. ట్విట్టర్లో కేంద్రమంత్రి పేర్కొన్నారు.
సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర
సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చూసి, నిర్వీర్యంచేసి చంపేందుకే కేంద్రప్రభుత్వం భారీ కుట్ర చేస్తున్నదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఈ కుట్ర కూడా అర్థంకావడం లేదని బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేయడం ద్వారా.. కోల్ బ్లాక్స్ను వేలంపాటలో కార్పొరేట్లకు దక్కేలా కేంద్రం చూస్తున్నదని ఆయన విమర్శించారు. సింగరేణిని నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఈ ఏడాది ఆగస్టు 10న నిర్వహించిన వేలంపాటలో ఔరోకోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సత్తుపల్లిలోని కోయగూడెం బ్లాక్-3ని అప్పగించిన విషయాన్ని బండి సంజయ్ గమనించాలని సూచించారు. సింగరేణికి కోల్బ్లాకులు ఇవ్వకుండా.. వేలంపాట వేయడంలో దాగిఉన్న మర్మం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
హాని చేస్తున్నా.. హామీ అంటారేం?
‘1957లో చేసిన మైన్స్ అండ్ మినరల్స్ చట్టం ప్రకారం బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నామని, బహిరంగ వేలం లో ప్రైవేటు సంస్థలతో సింగరేణికూడా పోటీపడి వాటిని దక్కించుకోవచ్చునని కేంద్రమంత్రి ప్రహ్లాద్జోషి చెప్తున్నారు. పదేపదే ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణలోని బ్లాకులన్నింటినీ సింగరేణికి ఎందు కు కేటాయించడం లేదు? 49 శాతంతో సంస్థ ప్రైవేటీకరణ అంతసులభం కాదని తెలిసీ, ఇలా సంస్థను మూతపడేలా చేయాలని చూస్తున్నారా? దీనికి ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు జవాబు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్రం సింగరేణికి హాని చేస్తుంటే, దానిని హామీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భావిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నదని స్పష్టంగా కనబడుతున్నా.. బండికి ఎందుకు అర్థం కావట్లేదని బోయినపల్లి ప్రశ్నించారు.
కోల్ బ్లాకులు ఇవ్వకుంటే.. సింగరేణి ఎట్ల నడవాలి?
బొగ్గు బ్లాకులు లేకుండా సింగరేణి ఎలా నడుస్తుందని బోయినపల్లి వినోద్కుమార్ సూటిగా ప్రశ్నించారు. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 50వేలమంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డున పడేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నదని ఆయన ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ పదం ఎత్తకుండా.. వ్యూహాత్మకంగా కోల్బ్లాకులను వేలంవేసి సింగరేణిని కేంద్రం నీరుగార్చుతున్నదని దుయ్యబట్టారు. కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని కోల్బ్లాకులన్నింటినీ సింగరేణికి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు సింగరేణిని ప్రైవేటుపరం చేయమంటూ ప్రధాని చెప్తూనే.. మరోవైపు కోల్ బ్లాకులను వేలంవేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తులను రంగంలోకి దించుతున్నారని వినోద్కుమార్ మండిపడ్డారు. బొగ్గు గనులు అందుబాటులో లేకుంటే.. సింగరేణి మూతపడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మొత్తం 82 కోల్ బ్లాకులు ఉండగా.. అందులో 40 కోల్బ్లాకులను మాత్రమే సింగరేణికి కేటాయించారని వినోద్కుమార్ తెలిపారు. మిగిలిన 42 కోల్ బ్లాకులనూ సింగరేణికి అప్పగించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.