హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య విద్యుత్తు బకాయిల వివాదంలో కేంద్రం జోక్యంపై హైకోర్టు తీర్పు వాయిదా పడింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం మంగళవారం ప్రకటించింది. ఏపీ బకాయిలు రూ.3,441.78 కోట్ల అసలు, చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు సర్చార్జి రూ.3,315 14 కోట్లతో కలిపి మొత్తం రూ. 6,756.92 కోట్లను 30 రోజుల్లో చెల్లించాంటూ గత ఆగస్టు 20న కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర విద్యుత్తు సంస్థలు హైకోర్టులో సవాల్ చేశాయి.
కేంద్ర ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం తుది విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచందర్రావు, విద్యుత్తు సంస్థల తరఫున వై రామారావు వాదనలు వినిపించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఈ వివాదంలో జోక్యం చేసుకొనే అధికారం కేంద్రానికి లేదని రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థల తరఫున వాదనలు వినిపించిన సీఎస్ వైద్యనాథన్, జే రామచంద్రరావు చెప్పారు. వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.