కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఇంకా 18 కాలేజీలు మంజూరు చేయాల్సి ఉన్నది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చొరవచూపి మంజూరు చేయిస్తానంటే స్వయంగా ప్రతిపాదనలు అందిస్తా. రాష్ర్టానికి మంచి జరుగుతుంది అనుకొంటే నాకు ఎలాంటి భేషజాలూ లేవు.
– మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతానికి ఐదు కార్యక్రమాలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల చేశామని, ఒకట్రెండు వారాల్లో నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు. దీంతో అన్ని పీహెచ్సీల్లో డాక్టర్లు అందుబాటులోకి వస్తారని పేర్కొన్నారు. స్టాఫ్నర్స్, స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. పల్లె దవాఖానల కోసం 1,569 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్హెచ్పీ) పోస్టుల భర్తీ ప్రక్రియను ఒకటిరెండు వారాల్లో ప్రారంభిస్తామని తెలిపారు. పీహెచ్సీల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను అనుసంధానిస్తూ కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘మానిటరింగ్ హబ్’ను మంత్రి హరీశ్రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 887 పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని, దేశంలోనే ఇదే తొలిసారి అని చెప్పారు. సీసీ కెమెరాలను డీపీహెచ్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీలో ఏర్పాటుచేసిన మానిటరింగ్ హబ్కు వీటిని అనుసంధానం చేశామని, ఇక్కడి నుంచే క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించారు.
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పట్టణాల్లో ప్రాథమిక వైద్యం అందించేందుకు ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానలు అద్భుతంగా పనిచేస్తున్నాయని మంత్రి హరీశ్రావు చెప్పారు. ప్రస్తుతం 331 బస్తీ దవాఖానలు ఉన్నాయని, వీటిని దాదాపు 500కు పెంచుతామని తెలిపారు. ఈ దవాఖానల్లో ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైందని చెప్పారు. ఫలితంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్ హాస్పిటళ్లపై ఒత్తిడి తగ్గటంతో, వారు సర్జరీలపై ఎక్కువ దృష్టిపెట్టారని వెల్లడించారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల పరీక్షలు చేశామని తెలిపారు.
కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదంటూ రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం అనేకసార్లు వినతిపత్రం అందించిందని, ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇంకా 18 కాలేజీలు మంజూరు చేయాల్సి ఉన్నదని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చొరవచూపి మంజూరు చేయిస్తానంటే స్వయంగా ప్రతిపాదనలు అందిస్తానని తెలిపారు. రాష్ర్టానికి మంచి జరుగుతుందనుకొంటే తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టంచేశారు.
మానిటరింగ్ హబ్ను ప్రారంభిచాక రంగారెడ్డి జిల్లా కుషాయిగూడ, సూర్యాపేట జిల్లా అంబేదర్ నగర్, సిద్దిపేటలోని అంబేదర్నగర్ పీహెచ్సీ వైద్యులతో హరీశ్రావు మాట్లాడారు. ఈ రోజు ఓపీ ఎంత వచ్చింది? ఎంతమందికి టెస్టులకు సిఫారసు చేశారు? మందులు అందుబాటులో ఉన్నాయా? వ్యాక్సినేషన్ ఎలా జరుగుతున్నది? ఏఎన్సీ చెకప్ ఎలా జరుగుతున్నది?వంటి వివరాలను ఆరా తీశారు. రోగులతో మాట్లాడి దవాఖానలో సేవలపై ఆరా తీశారు. డాక్టర్లు మంచిగా చూశారని, ట్యాబ్లెట్లు, సిరప్ వారు చెప్పగా.. వైద్యసిబ్బందిని మంత్రి హరీశ్రావు అభినందించారు. కార్యక్రమంలో డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, టీవీవీపీ కమిషర్ అజయ్కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేశానన్న సంతృప్తి కలిగిందని, నెలవారీ క్యాలెండర్ నిర్ణయించుకొని, సమీక్షించుకోవడం ద్వారా జవాబుదారీ తనం పెరిగిందని, సేవల్లో నాణ్యత పెరిగిందని తెలిపారు.
1) పల్లె దవాఖానలు: ఇప్పటికే రాష్ట్రంలో 680 పల్లె దవాఖానలు పనిచేస్తున్నాయి. మరో 1,569 పల్లె దవాఖానలను ప్రారంభించేందుకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టుల భర్తీకి మరో ఒకటి రెండు వారాల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత మరో 900 పల్లె దవాఖానలను అందుబాటులోకి తెస్తారు.
2) మరిన్ని బస్తీ దవాఖానలు: రాష్ట్రంలో ప్రస్తుతం 331 బస్తీ దవాఖానలు ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో 298, ఇతర మున్సిపాలిటీల్లో 33 పనిచేస్తున్నాయి. దవాఖానల సంఖ్యను 496కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని జనవరి నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ కాకుండా మున్సిపాలిటీల్లోనే మరో 67 బస్తీ దవాఖానలు రానున్నాయి.
3) పీహెచ్సీల్లో వైద్యులు: రాష్ట్రంలో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 751 పోస్టులు డీపీహెచ్ పరిధిలో, 211 టీవీవీపీ, 7 ఐపీఎం పరిధిలో ఉన్నాయి. వీరికి మరో పది రోజుల్లో నియామక పత్రాలు అందించనున్నారు.
4) మౌలిక వసతుల అభివృద్ధి: రూ.67 కోట్లతో 43 పీహెచ్సీలకు నూతన భవనాలను నిర్మించనున్నారు. 372 పీహెచ్సీల మరమ్మతులకు రూ.43 కోట్లు కేటాయించారు. 1,239 సబ్ సెంటర్లకు కొత్త భవనాలు, ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.247 కోట్లు, 1,497 సబ్ సెంటర్ల మరమ్మతులకు రూ.4 లక్షల చొప్పున రూ.60 కోట్ల కేటాయించారు.
5) మానిటరింగ్ హబ్: ప్రతి పీహెచ్సీలో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. హైదరాబాద్లోని డీపీహెచ్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీలో మానిటరింగ్ హబ్ ఏర్పాటుచేసి అనుసంధానించారు. వీటిద్వారా వైద్యులు, అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుంది. సేవల్లో నాణ్యత పెరుగుతుంది.