హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ రైతులకు కేంద్రం ధోకా ఇచ్చింది. ఆయిల్పామ్ గెలలకు కనీస ధర నిర్ణయించడంలో మెలిక పెట్టి రైతులకు నష్టం కలిగిస్తున్నది. కనీస ధరకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట కొత్త సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీని వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సూత్రం అమలు చేస్తే రైతులు ప్రస్తుతం అందుతున్న ధరలో మూడు శాతం నష్టపోవాల్సి వస్తుంది. దీంతోపాటు కనీస ధర నిర్ణయానికి గడిచిన ఐదేండ్ల సగటును తీసుకోవాలన్న కేంద్రం నిర్ణయంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం షరతుల నేపథ్యంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కు సంబంధించి కేంద్రంతో ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా 22శాతం ఓఈఆర్ను లెక్కించాలని, ఐదేళ్ల సగటును తీసేయాలని కేంద్రాన్ని కోరింది. ఆ నిబంధనలు తీసేస్తే ఒప్పందంలో చేరేందుకు ఆలోచిస్తామని లేఖ రాసింది.
22శాతం నుంచి 19శాతానికి తగ్గింపు
గింజల నుంచి వచ్చే నూనె శాతం(ఓఈఆర్) ఆధారంగా పామాయిల్ గెలల ధరలను నిర్ణయిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఓఈఆర్ను 22శాతంగా లెక్కించి టన్నుకు రూ.13వేల వరకు రైతులకు చెల్లిస్తున్నారు. రైతులకు నష్టం లేకుండా ఆయిల్తోపాటు గింజలను కూడా కలుపుతున్నారు. కానీ కేంద్రం ఓఈఆర్ను 19శాతంగా లెక్కించి కనీస ధరను నిర్ణయించాలని భావిస్తున్నది. ఇందులో కూడా కేవలం ఆయిల్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ గింజల ధరను లెక్కించడం లేదు. వాస్తవానికి గింజల ద్వారా వచ్చే నూనెకు అధిక ధర ఉంటుంది. ఈ ప్రకారం రైతులు మూడు శాతం ధరను నష్టపోవాల్సి వస్తుంది. అంటే రైతులు టన్నుకు సుమారు రూ. 2వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని అధికారులు చెప్తున్నారు.
ఐదేండ్ల సగటు ఆధారంగా కనీస ధర నిర్ణయం…
2020 నుంచి 2022 వరకు పలు కారణాలతో ఆయిల్పామ్ గెలల ధర ఎప్పుడూ లేనంత అధికంగా పలికింది. దీంతో గడిచిన ఐదేండ్ల సగటు తీసుకుంటే కనీస ధర ఎక్కువగానే వస్తుంది. కానీ రానున్న కాలంలో ధరలు తగ్గితే రైతులకు భారీ నష్టం జరుగుతుంది. కేంద్రం మరో షరతు కూడా పెట్టినట్టు తెలిసింది. మార్కెట్ ధర కనీస ధర కన్నా తక్కువగా ఉంటే మొదటి ఏడాది ఆ వ్యత్యాసం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లించాలి. ఆ తరువాత ఏడాదికేడాది కేంద్రం తన వాటాను తగ్గిస్తూ పోతుంది. ఈ విధంగా 2037 నాటికి కేంద్రం చెల్లించాల్సిన వాటాను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలు మోయాల్సి వస్తుంది.
దిగుమతి సుంకాన్ని ఎత్తేసిన కేంద్రం
విదేశాల నుంచి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. దీంతో దేశంలో ఆయిల్పామ్ ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఆయిల్పామ్ రైతులకు నష్టం వాటిల్లుతుంది.కేంద్రం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.