హైదరాబాద్, ఫిబ్రవరి 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ పాలనలో ఉన్న రాష్ర్టాలకే మెజార్టీ ప్రాజెక్టులు, నిధులు కట్టబెట్టే పనిలో ఉన్నది. పలు అంశాలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతున్న కేంద్రం.. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన(పీఎంకేఎస్వై) కింద మంజూరు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్టుల్లోనూ కొత్త రాష్ట్రంపై కక్ష చూపింది. ప్రాజెక్టుల్లో సింహభాగాన్ని బీజేపీ పాలిత రాష్ర్టాలకే కట్టబెట్టింది. తెలంగాణకు నామ్కేవాస్తేగా కేటాయింపులు చేసింది. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రకు 162 ప్రాజెక్టులు మంజూరు చేయగా.. గుజరాత్కు 81, ఉత్తరప్రదేశ్కు 66, కర్ణాటకకు 42 కేటాయించింది. అదే తెలంగాణకు 26 ప్రాజెక్టులు మాత్రమే ఇచ్చింది.
ఈ వివరాలను కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల సహాయ మంత్రి ప్రహ్లద్ సింగ్ పటేల్ రాజ్యసభలో వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం 104 ప్రతిపాదనలు పంపగా.. అందులో 26కు మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు 66 ప్రాజెక్టులు మంజూరు చేయడం గమనార్హం.