వనపర్తి రూరల్, మే 23: దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి నుంచి ఎరువులపై సబ్సిడీని గత ప్రభుత్వాలు కొనసాగించాయని, కానీ, మోదీ సర్కార్ మాత్రం ఎరువుల సబ్సిడీలో కోత విధించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఏదో మోదీ అధికారంలోకి వచ్చాకే ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందూ గార్డెన్స్లో నిర్వహించిన విశ్వ ఆగ్రోస్ మార్క్ఫెడ్ గోల్డ్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
దేశ రైతులకు అందిస్తున్న ఎరువుల సబ్సిడీలో కేంద్రం పాత్ర శూన్యమని విమర్శించారు. ఎరువుల సబ్సిడీ, ఫసల్ బీమాపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలు అమాయకంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రతి జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 40 వరకు ఆయిల్పాం పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. సమావేశంలో మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మార్క్ఫెడ్ సభ్యుడు విజయ్కుమార్, డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.