ఖైరతాబాద్, ఏప్రిల్ 24: ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రకు తెరలేపిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ దళితదండు, తెలంగాణ మాల మహానాడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, తెలంగాణ మాదిగ దండోరా, మాదిగ జేఏసీ, రిపబ్లిక్ పార్టీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ గర్జన సమావేశానికి తెలంగాణ దళిత దండు వ్యవస్థాపక అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. మారుతున్న సమాజానికి తగ్గట్టుగా ఏదైనా కొత్త అంశాన్ని చేర్చాలంటే రాజ్యాంగ సవరణలు చేసే అవకాశం ఉన్నదన్నారు. ఇప్పటికీ రాజ్యాంగాన్ని 121 సార్లు సవరించారని, ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఉద్యోగవకాశాలు, సుప్రీం, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా పెట్టడానికి రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు. దేశంలో 75 కోట్ల మంది బీసీలకు ఇంతవరకు రాజకీయ రిజర్వేషన్లు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా, ఉద్యోగాల్లోనూ అవకాశం దొరకడం లేదని చెప్పారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించలేదన్నారు. జనాభా దామాషా ప్రకారం పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు పెంచాలన్నారు.
పోలీస్ వయోపరిమితి రెండేండ్లు పెంచాలి
పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేండ్లు పొడిగించాలని హోంమంత్రి మహమూద్ అలీని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం హోంమంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే వయోపరిమితిని మూడేండ్లు పొడిగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన ఆయన.. రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించడం తెలంగాణ చరిత్రలోనే అరుదైన ఘట్టం అని పేర్కొన్నారు. హోంమంత్రిని కలిసినవారిలో ఎన్ వెంకటేశ్, జీ అనంతయ్య, చంటి ముదిరాజ్, సీ రాజేందర్, వేముల రామకృష్ణ తదితరులు ఉన్నారు.