హనుమకొండ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం హనుమకొండ, అంబేద్కర్ సర్కిల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేక బీజేపీపై ఉద్యమించాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్నారని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ దళిత వర్గానికే కాకుండా సమాజంలోని అందరికీ చెందినవారని పేర్కొన్నారు. దళితులకు, రైతులకు, పేదలకు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ రాజ్యాంగ స్పూర్తితోనే కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు.
కేంద్రం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా రిజర్వేషన్లను మంటగలిపే కుట్ర చేస్తోందని విమర్శించారు. కేంద్రం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తేనే కేంద్రం దిగి వస్తుందని తెలపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, కలెక్టర్ గోపి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.