హైదరాబాద్, మార్చి23 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ ఇండియా, సౌతాఫ్రికా దేశాలకు మహాత్ముడేనని సౌతాఫ్రికా డిప్యూటీ హైకమిషనర్ సెడ్రిక్ క్రౌలీ కొనియాడారు. ‘దక్షిణాఫ్రికాతో వాణిజ్యం-పెట్టుబడి అవకాశాలు’ అనే అంశంపై హైదరాబాద్ రెడ్ హిల్స్లోని తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో గురువారం నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో క్రౌలీ మాట్లాడుతూ, ఉగాది శుభాకాంక్షలు తెలుపడంతోపాటు జాతిపిత మహాత్మా గాంధీని ఆయన ప్రస్తావించారు.
‘మీరు మాకు బారిస్టర్ను ఇచ్చారు, మేము మీకు మహాత్మాగాంధీని ఇచ్చాం. మీ మహాత్ముడు.. మా మహాత్ముడే’ అని గుర్తుచేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం చరిత్రాత్మకమని కొనియాడారు. రక్షణ, కళలు, సంసృతి, వ్యవసాయం తదితర రంగాల్లో సౌతాఫ్రికాకు భారత్ సహకారం అందించాలని కోరారు. ఐసీటీ (ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ)లో హైదరాబాద్కు మంచి గుర్తింపు ఉన్నదని, సిలికాన్ వ్యాలీని అధిగమించిందని మెచ్చుకున్నారు. కార్యక్రమంలో పొలిటికల్ ఫస్ట్ సెక్రటరీ కతుషిలో తంగ్వానా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ ఏవీపీఎస్ చక్రవర్తి పాల్గొన్నారు.