హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై (KTR) కాంగ్రెస్ సర్కార్ మరో కేసు బనాయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సీసీఎస్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్పై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 16న విచారణకు రావాలని కోరింది. ఇంతకు ముందు మే 28న కూడా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపింది. అయితే, తనకు ముందుగానే యూకే, యూఎస్ఏలో పలు ఈవెంట్ల కోసం వెళ్లే ఏర్పాట్లు ఉండటంతో తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ ముందు హాజరవుతానని వారికి రాతపూర్వకంగా కేటీఆర్ తెలియజేశారు. ఇదే కేసులో ఈ ఏడాది జనవరి 3న నోటీసులిచ్చిన ఏసీబీ అదే నెల 6న విచారణకు పిలిచింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ ఏసీబీ విచారణకు లాయర్తో జనవరి 6న హాజరైతే.. లాయర్తో విచారణకు రానివ్వమని ఏసీబీ తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ గేటు బయటే.. లిఖితపూర్వకంగా తన సమాధానం రాసి ఇచ్చారు కేటీఆర్.
అనంతరం జనవరి 7న హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులిచ్చింది. దీంతో అప్పటికే హైకోర్టులో ఆ కేసు నడుస్తుండటంతో కేసు తేలే వరకూ రానని కేటీఆర్ చెప్పారు. దీంతో జనవరి 8న ఇచ్చిన నోటీసుల్లో 9న హాజరుకావాలని కోరడంతో జనవరి 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. మొత్తం 7 గంటల్లో 82 ప్రశ్నలు అడిగారు. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం కేటీఆర్ను జనవరి 16న విచారణకు పిలిచింది. ఆయన జనవరి 16న 8 గంటల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు 40కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.