హైదరాబాద్ జనవరి 7 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలు చేపట్టింది. శనివారం ఉదయం నుంచి మొత్తం ఆరు చోట్ల 14 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాల చెల్లింపుల విషయమై ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తున్నది. చంచల్గూడ ఒవైసీ దవాఖాన డాక్టర్ అంజూమ్ సుల్తానా ఇంటితోపాటు ఆమె భర్త ఎజాజ్ఖాన్ నిర్వహిస్తున్న ఆటోమొబైల్ కంపెనీ, రియల్ ఎస్టేట్ సంస్థల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. వారు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలు, డాక్యుమెంట్లు, వ్యాపార సముదాయాలకు సంబంధించిన కీలక వివరాలు సేకరించినట్టు సమాచారం. గతంలో ఓ జాతీయ బ్యాంకులో ఎజాజ్ లోన్ తీసుకొన్నారు. ఆ రుణం చెల్లించకపోవడంతో సదరు బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే తనిఖీలు జరిగాయి.
ఎక్సెల్లో ముగిసిన ఐటీ సోదాలు
కాంగ్రెస్ నేత అనిరుధ్రెడ్డి ఇంటితోపాటు ఎక్సెల్ కార్యాలయాల్లో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు శనివారంతో ముగిశాయి. గచ్చిబౌలిలోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రధాన కార్యాలయంతోపాటు ఎక్సెల్ టైర్ల కంపెనీ, బాచుపల్లి, చందానగర్లో ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సెల్ కంపెనీకి చెందిన ఆరుగురు డైరెక్టర్ల ఇండ్లలోనూ సోదాలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. సోమవారం విచారణకు హాజరు కావాలని అనిరుధ్రెడ్డి, ఆయన భార్య మంజూషకు అధికారులు నోటీసులు పంపారు. సంబంధిత ఆస్తుల వివరాలను సైతం ఐటీ ఫార్మాట్లో సమర్పించాలని అధికారులు సూచించారు.