హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు హత్య కేసును రెండు సీబీఐ బృందాలు దర్యాప్తు చేశాయి. ఆదివారం ఒక బృందం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లగా.. మరో బృందం మరోసారి పులివెందులలోని వివేకా ఇంటితోపాటు ఎంపీ అవినాష్రెడ్డి ఇంటిని పరిశీలించింది. సీబీఐ అధికారులు అవినాష్రెడ్డి పీఏ రమణారెడ్డిని పులివెందుల రింగ్రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. హత్య జరిగిన రోజు జమ్మలమడుగు వెళ్తుండగా తనకు ఫోన్ వస్తే తిరిగి వచ్చానని అవినాష్రెడ్డి చెప్పిన నేపథ్యంలో దానిని నిర్ధారించుకునేందుకు పీఏను తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది.
ఎంత సమయంలో వివేకా ఇంటికి అవినాష్ వచ్చారనే దానిపై ప్రధానంగా సీబీఐ ఆరా తీసింది. వివేకా ఇంట్లో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సోమవారం సుప్రీంకోర్టులో వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుగనున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు తాజాగా వివేకా, అవినాష్రెడ్డి ఇండ్లను పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన సీబీఐ బృందం సోమవారం సుప్రీంకోర్టులో జరిగే విచారణకు హాజరుకానున్నది.