హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఈ నెల 30న జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. 30న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ అధికారులు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్, శానిటైజర్స్, బ్యాలెట్ బ్యాక్సుల శానిటైజేషన్ పూర్తైనట్లు వెల్లడించారు. క్యూ లో ఓటర్ల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా ఆ విధంగానే రింగ్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవిడ్ దృష్ట్యా రద్దీని నివారించేందుకు ఓటర్లు ప్రారంభంలోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయాల్సిందిగా సూచించారు.