హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్)ను ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సహచర మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి శుక్రవారం సచివాలయంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పలువురు ఉద్యోగ సంఘాల నేతలకు హెల్త్కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈహెచ్ఎస్ ద్వారా రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబసభ్యులకు కలిపి మొత్తం 29.80 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని, వారికి 886 నెట్వర్క్ దవాఖానల ద్వారా 1,816 రకాల చికిత్సలకు సంపూర్ణ నగదు రహిత వైద్యం అందుతుందని వివరించారు. ప్రస్తుతం రూ.10 వేల కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున చెల్లిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఎస్, ఈహెచ్ఎస్ ట్రస్టు బోర్డు చైర్మన్ సంజయ్ జాజు, ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, బెన్హర్ మహేశ్దత్ ఎక్కా, క్రిస్టినా జెడ్ చోంగ్తూ, డాక్టర్ యోగితా రాణా, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, పుల్గం దామోదర్రెడ్డి, వంగ రవీందర్రెడ్డి, లచ్చిరెడ్డి, వోడ్నాల రాజశేఖర్, కటకం రమేశ్, సీహెచ్ రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం కొందరికే హెల్త్కార్డులు
ప్రస్తుతానికి ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కొందరికి వర్తించనున్నది. 010 పద్దు ద్వారా జీతాలు పొందుతున్న ఉద్యోగులకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మిగతా వారికి వర్తింపజేయడం లేదు. తెలంగాణ మాడల్ స్కూల్స్, గురుకులాల్లోని బోధన, బోధనేతర సిబ్బందితోపాటు రాష్ట్రంలోని అన్ని రకాల యూనివర్సిటీలు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల సిబ్బందికి, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అమలు కావడంలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ, ప్రభుత్వ రంగంలోని గోల్కొండ, విజయడైరీ లాంటి సంస్థల ఉద్యోగులు సైతం నగదు రహిత వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. దీంతో ఆయా వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగులకు హెల్త్కార్డులు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రవి, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు.