జోగులాంబ గద్వాల : ప్రశ్నించే వారిపై ప్రభుత్వం అక్రమ కేసుల పరంపర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. హక్కుల సాధనకు నిలదీస్తున్న సామాన్యుడి నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఏదో ఒక రంగా ఇబ్బందులపాలు చేస్తుంది.
గద్వాల మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని కమిషనర్ను నిలదీసిన 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ( BRS Councilors ) పులిపాటి వెంకటేశ్, జగదీష్, గువ్వలగోపాల్, మోహన్ యాదవ్, సంటేన్న ,చిన్న రాముడు,నరసింహ కమ్మరి సునీత గంగాళం మంజుల రాణి,లత , బీఆర్ఎస్ నాయకుడు చిత్తారి కిరణ్ పై పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, పోలీసుల తీరును నిరసిస్తూ కౌన్సిలర్లు శనివారం నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ చట్టబద్ధంగా జరగాల్సిన ఎన్నికను ఎన్నిక నియమావళికి విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కో ఆప్షన్ ఎన్నికలలో భాగంగా గత నెల 23న నామినేషన్ దాఖలు కు చివరిరోజు కావడంతో నామినేషన్ పత్రాలను స్వీకరించడానికి మున్సిపల్ కార్యాలయంలో ఏ అధికారి లేక పోవడం, దానికి ఒక విభాగాన్నికూడా ఏర్పాటు చేయకపోవడంపై మున్సిపల్ కమిషనర్ను అడిగామని తెలిపారు.
పోలీస్ అధికారులను తప్పుదారి పట్టించి మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించకున్నా తమపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. కౌన్సిలర్లుగా తమ హక్కుల కోసం ప్రజల పక్షాన ఖచ్చితంగా కమిషనర్ను నిలదీస్తామని, తప్పుడు పని చేసే ప్రతి అధికారిని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.