రామగుండం ఫర్టిలైజర్సిటీ, జూన్ 11: పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం, మంథని మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ, వనజతోపాటు బీఆర్ఎస్ నాయకులపై గురువారం గోదావరిఖని వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముత్తారం పోలీస్స్టేషన్ పరిధి అడవి శ్రీరాంపూర్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కమాన్పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణను పోలీసులు ఏ-2 చేర్చారు. కేసుతో ఎలాంటి సంబంధం లేని నాయకుడిపై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధుకర్తోపాటు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున ఈనెల 9న గోదావరిఖని ఇల్లందు గెస్ట్హౌస్, సీపీ కార్యాలయం మార్గంలో ఆందోళన నిర్వహించారు.
ఈ ఘటనలో బీఆర్ఎస్ నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు భంగం కలిగించారని బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ వీ వెంకటేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రామగుండం పోలీసు కమిషనర్ను కలిసేందుకు వెళ్తున్న తమను, తమ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని కేసు నమోదు చేయడం అక్రమమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకూ ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నందని ఆందోళన వ్యక్తంచేశారు.