హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఇంధన కొరత వల్ల ప్రజల ఇబ్బందులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, ప్రజాప్రయోజనా ల పరిరక్షణ కోసం తాను చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడుతోపాటు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న అంశాలపై ఈ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఇదే అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ, సుప్రీంకోర్టు లీగల్ సెల్, రాష్ట్ర ప్రభుత్వాలకూ వినతిపత్రాలు అందచేసినట్టు తెలిపారు.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరతతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని, అత్యసవర సేవలపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అనేవి విలాస వస్తువులు కాదని, ఇవి ప్రజల దైనందిన జీవనం, జీవనోపాధి, వ్యవసాయం తదితర వ్యవస్థలకు మూలాధారమని పేర్కొన్నారు. దీని ప్రభావం అంబులెన్సులు, ప్రజారవాణా, వ్యవసాయం, ఆహార పదార్థాల సరఫరా, గృహావసరాలు, పరిశ్రమలు, సేవలు వంటి పలు రంగాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని, ఇంధన కొరత నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.