Balka Suman | చెన్నూర్, మార్చి 11: బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తోపాటు ఇతర బీఆర్ఎస్ నాయకులపై చెన్నూర్లో నమోదైన కేసును హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
చెన్నూరు మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనతోపాటు చెన్నూరు జడ్పీ మాజీ చైర్మన్ మూల రాజిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ బాల్క సుమన్, రాజిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే సుజన బుధవారం విచారణ జరిపారు. మండల వ్యవసాయ అధికారి కే యామిని ఫిర్యాదు మేరకు చెన్నూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఫిర్యాదు చేసే పరిధి ఆ అధికారికి లేదని తీర్పులో పేరొన్నారు.
ఈ కేసుపై బాల్క సుమన్ తరఫు న్యాయవాది, బీఆర్ఎస్ లీగల్సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం మల్లేశంగౌడ్ చెన్నూర్లో మాట్లాడారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు పోలింగ్ కేంద్రాల వద్దకు బైక్పై వచ్చి ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేశారని తెలిపారు. దీనిని వ్యతిరేకిస్తూ బాల్క సుమన్, ఇతర నాయకులు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలిపారని పేర్కొన్నారు. ఇందుకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ చెన్నూర్ పోలీసులు.. బాల్క సుమన్తోపాటు ఇతర బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే ఇది తప్పుడు కేసు, చెల్లని కేసు అని బాల్క సుమన్తో పాటు మూల రాజిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. దీంతో ఈ కేసును విచారించిన హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పునిచ్చిందని వెల్లడించారు.