హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): వంటల్లో అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు! ఉప్పుకు ఉన్న ప్రాధాన్యం అదే. కూరల్లో ఏది తక్కువైనా తింటామే తప్ప, ఉప్పు లేకపోతే ఎవరికీ ముద్ద దిగదు. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవటంతో రక్తపోటు, గుండె జబ్బుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. దేశంలో మెట్రో నగరాల్లోనే ఉప్పు వినియోగం భారీగా పెరుగుతున్నట్టు జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) అధ్యయనాల్లో తేలింది. ఎన్ఐఎన్ ప్రమాణాల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 2.2 గ్రాముల(టేబుల్ స్పూన్) ఉప్పు తీసుకొంటే ఉత్తమం. కానీ మెట్రో నగరాలైన ముంబై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలో 8-13 గ్రాముల ఉప్పు రోజువారీగా తీసుకుంటున్నారని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్, అగ్రికల్చర్ నివేదిక తేల్చింది.
గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లోనే లవణ వినియోగం ఏటా 1-2.5 శాతం పెరుగుతున్నట్టు వెల్లడైంది. ఢిల్లీలో 14.13 గ్రాములు, ముంబై లో 10.21గ్రాములు, కోల్కతాలో 9.81గ్రాములు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో 9.38గ్రాముల ఉప్పును నిత్యం వినియోగిస్తున్నారు. ఉప్పు వినియోగం పెరగడానికి జంక్ ఫుడ్, బిర్యానీ, ఫాస్ట్ఫుడ్, సూప్స్ను కారణంగా గుర్తించారు. ఏటా దేశంలో 55-58 లక్షల టన్నుల ఉప్పు వినియోగిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. సగటున రోజుకు 4.5-5 గ్రాముల సోడియం శరీరంలోకి చేరుతుండటంతో గుండె జబ్బులు, రక్తపోటు, యూరినరీ ఇన్ఫెక్షన్లు, హైపర్ టెన్షన్ వంటి రుగ్మతల బారినపడుతున్న వారి సంఖ్య 10-15 శాతం పెరుగుతున్నట్టుగా నివేదికలు పేర్కొంటున్నాయి.
పొటాషియం తక్కువ.. సోడియం ఎక్కువ
వైద్యారోగ్య, పోషకాహార నిపుణుల సూచన ప్రకారం శరీరానికి పోటాషియం, సోడియం కీలకం. వీటిపైనే గుండె పనితీరు ఆధారపడి ఉంటుంది. పండ్లు, కూరగాయల ద్వారా సరిపడినంత పోటాషియం శరీరానికి అందుతున్నా, ఎక్కువ మొత్తంలో సోడియం పేరుకుపోతున్నది. రోజువారీగా ఆహారంలో సోడి యం పరిమాణం తగ్గిస్తే దేశంలో నమోదవుతున్న గుండె జబ్బు మరణాలను 10 శాతం తగ్గించడానికి వీలుంటుందని తేలింది. అకాల మరణాలను 25 శాతం తగ్గించవచ్చు. ఫిన్లాం డ్, జపాన్ దేశాల్లో మూడు దశాబ్దాలుగా సోడి యం వినియోగాన్ని 30 శాతం తగ్గించడంతో కార్డియోవాస్క్యులర్ జబ్బులు 75 శాతం తగ్గినట్టు గుర్తించారు.