గోల్నాక : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ( KTR )పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్కు డూడూ బసవన్న కిషన్ రెడ్డి కావాలో.. హక్కులు, అభివృద్ధిపై కొట్లాడే నాయకుడు కావాలో నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకునే సమయం వచ్చిందని అన్నారు. అంబర్పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి క్లీన్ స్వీప్ చేశారని వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. 119 సీట్లలో 39 సీట్లు సాధించి బలమైన ప్రతి పక్షంగా ఉన్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ దొంగ మాటలు నమ్మి కేసీఆర్ (KCR) ను దూరం చేసుకున్నామని ప్రజలు బాధ పడుతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదన్న కేసీఆర్ మాటలను కాంగ్రెస్ నిజం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని చార్ సౌ బీస్ హామీలని ఎద్దేవా చేశారు.
సికింద్రాబాద్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర కేబినేట్ మంత్రి జి.కిషన్ రెడ్డి (Minister Kishan Reddy) తన నియోజకవర్గానికి పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రపంచం గర్వపడేలా కాళేశ్వరం(Kaleshwaram) లిఫ్టులు ప్రారంభిస్తే, కిషన్ రెడ్డి మెట్రో రైల్వే స్టేషన్ లిఫ్టులు, సింటెక్స్ ట్యాంకులను ప్రారంభిస్తున్నాడని విమర్శించారు. మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడం బీజేపీకే చెల్లిందన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో వచ్చే పార్ల మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, అరెకపూడి గాంధీ, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ నేతలు తలసాని సాయి కిరణ్యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.