పాల్వంచ, ఏప్రిల్ 5: నవ మాసాలు మోసి కని, 19 ఏండ్లపాటు పెంచిన కొడుకు.. తల్లి కళ్లెదుటే రక్తపు మడుగులో కొట్టుకుంటూ కన్ను మూస్తే.. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఆదివారం సరిగ్గా ఇదే విషాదకర ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం జయంత్యుత్సవానికి అతిథిగా పాల్వంచ కరకవాగు గ్రామానికి చెందిన 34వ డివిజన్ కార్పొరేటర్ భట్టు విజయలక్ష్మిని నిర్వాహకులు ఆహ్వానించారు. పాల్వంచ బస్టాండ్ ఎదురుగాగల బాబూ జగ్జీవన్రాం విగ్రహం వద్దకు వెళ్లేందుకు ఆమె తన కుమారుడు భట్టు అఖిల్నందన్ అలియాస్ విక్కీ(19) బైక్పై ఆదివారం బయల్దేరారు.
కరకవాగు నుంచి బస్టాండ్ మూలమలుపు తిరుగుతుండగా, వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు (టీఎస్ 28 జీ 9414) ఢీకొన్నది. తల్లీకొడుకు కింద పడిపోయారు. విక్కీ తలపై నుంచి కారు దూసుకెళ్లింది. విక్కీ అక్కడికక్కడే మృతి చెందాడు. విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించారు. ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.