Road accident : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్యాతండా దగ్గర అడ్డువచ్చిన కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లితోపాటు చిన్నారులైన ఇద్దరు కుమార్తెలు మరణించారు. కారు నడుపుతున్న ప్రవీణ్కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
బాబోజీ తండాకు చెందిన డాక్టర్ బోడ ప్రవీణ్ కుటుంబం హైదరాబాద్కి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుక్క అడ్డురావడంతో దానిని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీ కొట్టింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద ఘటనపై మృతుల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోయినా వారు మరణించడంతో మృతురాలు భర్త ప్రవీణ్ను అనుమానిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.