Telangana | హైదరాబాద్, అక్టోబర్ 28 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కర్ణాటక కంపెనీ.. కేన్స్ టెక్నాలజీస్ రూ.2,800 కోట్లతో ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమీకండక్టర్ ఉత్పాదక కేంద్రాన్ని తెలంగాణకు తీసుకువస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్ గ్రామంలో ఈ ప్లాంట్ కోసం గత మంగళవారం భూమిపూజ జరిగింది. దీంతో కొత్తగా 2,000 మందికిపైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. అయితే, కర్ణాటకలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాల కారణంగానే అక్కడ నెలకొల్పవలసిన సెమీకండక్టర్ ఉత్పాదక కేంద్రాన్ని కేన్స్ టెక్నాలజీస్ సంస్థ తెలంగాణకు తరలించిందన్న విషయం తాజాగా వెల్లడైంది.
ఎలక్ట్రానిక్స్ రంగంలో కొనసాగుతూనే, సెమీకండక్టర్ సెక్టార్లో విస్తరించాలన్న ఉద్దేశంతో కేన్స్ టెక్నాలజీస్ తొలుత మైసూరులో రూ. 2,800 కోట్లతో ప్లాంట్ను ప్రారంభించాలనుకొన్నది. ఈ మేరకు అనుమతులనివ్వాలంటూ కర్ణాటక కాంగ్రెస్ సర్కారుకు మూడు నెలల కిందట ప్రతిపాదనలు పంపింది. అయితే, ఎన్నిరోజులు గడిచినప్పటికీ, సర్కారు నుంచి సమాధానం రాలేదు. పరిశ్రమల శాఖకు చెందిన ప్రభుత్వాధికారులను కేన్స్ ప్రతినిధులు సంప్రదించాలని చూశారు కూడా. అయినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.
మరోవైపు ప్లాంట్లో పెట్టుబడులు పెట్టిన ఇతర భాగస్వాముల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. అనుమతుల్లో జాప్యంతో కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలు మారే ప్రమాదం ఏర్పడింది. దీంతో చేసేదేమీలేక, ప్రత్యామ్నాయమార్గాలను కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. తెలంగాణ టీఎస్ఐపాస్కు ఆకర్షితులై ప్లాంట్ను ఇక్కడ నెలకొల్పేందుకు నిర్ణయించారు. 35 ఏండ్లపాటు మైసూరులో సేవలందిస్తున్నామని, స్థానికంగా ఉన్న వందలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని కాంగ్రెస్ సర్కారుకు ప్రతిపాదన లేఖలో విన్నవించామని, అయినప్పటికీ, సర్కారు అనుమతులనివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కేన్స్ కంపెనీకి చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్ కర్ణాటక దాటి వెళ్లడంపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో, కర్ణాటకకు చెందిన మోహన్దాస్ పాయ్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కారు వైఖరిని ఎండగట్టారు. ప్లాంట్ తరలిపోయిన రోజును కర్ణాటక ప్రజలకు దుర్దినంగా అభివర్ణించారు. కాంగ్రెస్ సర్కారు బద్ధకం, అసమర్థత, తీవ్ర జాప్యం, జవాబుదారీతనం లేకపోవటం వల్లే మైసూరు నుంచి ఓ మంచి కంపెనీ తెలంగాణకు తరలివెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. కంపెనీలు ఇలాగే తరలిపోతే కన్నడ యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని సిద్ధరామయ్య సర్కారును నిలదీశారు.
పాయ్ వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు సమర్థించారు. దీంతో అప్రమత్తమైన కర్ణాటక పరిశ్రమల శాఖమంత్రి ఎంబీ పాటిల్ కొత్త కథ మొదలుపెట్టారు. రూ. 500 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించాల్సి ఉంటుందని, అయినప్పటికీ, ఆ భేటీకి ముందే కేన్స్ కంపెనీ ప్రతిపాదనలను తాము ఆమోదించినట్టు పేర్కొన్నారు. అయితే, కంపెనీ ప్రతినిధులు ఎక్కువ రాయితీలను కోరారన్న మంత్రి.. రాయితీల పేరిట తాము నిబంధనలను ఉల్లంఘించలేమని చెప్పుకొచ్చారు. అయితే, మంత్రి వ్యాఖ్యలు అబద్ధాలని కేన్స్ కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలు, జాప్యంతోనే కేన్స్ ప్లాంట్ తరలిపోయిందని కన్నడ పౌరులు మండిపడుతున్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్నిరకాల సదుపాయాలను టీఎస్ఐపాస్ ద్వారా త్వరితగతిన తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నది. దీంతో పెట్టుబడిదారులు భారీగా ముందుకొస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ కేన్స్ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్లాంటే. ఈ నెల తొలివారంలో కేన్స్ ప్రతినిధులు ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో ప్రత్యేక భేటీ కావటం, నెల చివరినాటికి ప్లాంట్ ఏర్పాటుకు భూమిపూజ కూడా జరగటమే దీనికి నిదర్శనం. టీఎస్ఐపాస్తో 15 రోజుల్లోనే అనుమతులు లభిస్తుండటంతో గత తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 23 వేల పరిశ్రమలు క్యూ కట్టాయి. 17 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. అందుకే, స్నేహపూర్వక పారిశ్రామిక విధానానికి కేరాఫ్గా మారిన టీఎస్ఐపాస్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నది.
రమేశ్ కన్నన్ అనే యువకుడికి ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. తన ఇష్టానికి అనుగుణంగా మైసూరు ఇంజినీరింగ్ కాలేజీలో 1988లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అదే ఏడాది మైసూరులో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని కేన్స్ టెక్నాలజీస్ పేరిట ఓ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ కంపెనీని స్థాపించాడు. తాను పెరిగిన ప్రాంతంలోని యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే కర్ణాటకలోనే దీన్ని స్థాపించినట్టు చెప్పాడు.
అద్దె గదిలో మొదలైన కేన్స్ టెక్నాలజీస్ ఇప్పుడు 1,500కు పైగా ఉద్యోగులతో, రూ.676 కోట్లు ఆదాయంతో మూడు ఖండాల్లోని 250 మంది క్లయింట్లకు సేవలందించే స్థాయికి చేరింది. సుఖోయ్ జెట్స్, మెట్రో ట్రైన్స్ కీలక విడిభాగాలను కూడా తయారుచేస్తున్నది. తాను పెరిగిన గడ్డ మీద మమకారంతో 35 ఏండ్ల కిందట కర్ణాటకలో కంపెనీని స్థాపించిన కన్నన్.. ఇప్పుడు అదే కర్ణాటకను వద్దనుకొని తెలంగాణలో 2,800 కోట్లతో కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్కు ఇటీవల భూమి పూజ చేశారు. ఎందుకు?? కారణాలు రెండు. ఒకటి.. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అసమర్థ పాలన. రెండు.. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు స్నేహపూర్వక పారిశ్రామిక విధానం.
తెలంగాణలో సెమికండక్టర్ ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమికండక్టర్ టెక్నాలజీతో కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కేన్స్ టెక్నాలజీ సంస్థకు అభినందనలు. 2,800 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న యూనిట్ ద్వారా రెండువేల మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేన్స్ రాక తెలంగాణకు వ్యూహాత్మక పెట్టుబడి అవుతుంది. తెలంగాణలో సెమికండక్టర్ అనుకూల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉన్నది.
– కేన్స్ టెక్నాలజీ ప్రతినిధుల భేటీ సమయంలో మంత్రి కేటీఆర్
కేన్స్ ప్లాంట్లో తయారయ్యే సెమీకండక్టర్స్ను దేశ, విదేశీ మార్కెట్లలోకి తీసుకెళ్తాం. తైవాన్, జపాన్ తదితర దేశాలకు ఎగుమతి అవుతాయి. రకరకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం మదర్ బోర్డులనూ తయారు చేస్తాం. భవిష్యత్తులో కొంగరకలాన్ పేరు ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్మోగుతుంది. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన తైవాన్, జపాన్ వంటి దేశాల సరసన భారత్ నిలవడానికి కొంగరకలాన్ తరహా ఇండస్ట్రియల్ పార్కులు అవసరం.
– సవితా రమేశ్, కేన్స్ టెక్నాలజీ చైర్పర్సన్ (భూమిపూజ వేడుకలో)